ఆర్మీ అధికారి ప్రాణం తీసిన చైనా మంజా…

దిశ దశ, హైదరాబాద్:

ప్రాణాలతో చెలగాటమాడే చైనా మంజాను వినియోగించ వద్దని సంక్రాంతి పండగ  సమయంలో పోలీసు అధికారులు చెప్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. అధికారులు చెప్తారు వారి మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోదాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చాలామంది. సంక్రాంతి పండగ సందర్భంగా పతంగులను ఎగురేయడం సాంప్రాదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా కైట్స్ ఎగురవేసేందుకు గతంలో స్థానికంగా ఉపయోగించే మంజాను వాడే వారు. అయితే ఇక్కడ దొరికే మంజాకన్నా పటిష్టంగా ఉంటుందని చైనా మంజాను వినియోగిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. పండగ పూట పతంగులు ఎగురవేసి సంబరాలు జరపుకుంటున్న వారు ఇతరుల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ఘటన ఏకంగా ఓ ఈర్మీ అధికారినే బలి తీసుకుంది. పతంగిని ఎగుర వేసేందుకు ఉపయోగించిన చైనా మంజాతో బైక్ పై వెల్తున్న ఆర్మీ అధికారి కోటేశ్వర్ రావుకు తగలడంతో గాయాల పాలయ్యారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గుండెలను ఎదురించి శత్రువులతో  పోరాడే ఆర్మీ అధికారిని చైనా మంజా బలి తీసుకున్న తీరు స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆదివారం జరిగిన ఈ ఘటనతో కోటేశ్వర్ రావు కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా ఇండియాన్ ఆర్మీ కూడా ఓ అధికారిని కోల్పోయేలా చేసింది. చైనా మంజా ఎంత ప్రమాదకరమో పోలీసు అధికారులు పదేపదే చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఈ దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇకనుండైనా చైనా మంజాను బహిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. 

Army officerChina ManjaHyderabadLangar Housesankaranthi
Comments (0)
Add Comment