sand mafia: ఇసుక బాధితులకు బాసటగా కాంగ్రెస్ ఎంపీ..!

కట్టడి చేయాలి: వంశీ కృష్ణ

దిశ దశ, కాటారం:

ఇసుక లారీల కారణంగా ప్రమాదాల బారిన పడిన కుటుంబాలకు బాసటగా నిలుస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ధన్వాడ గ్రామానికి చెందిన తుల్సెగారి రాజలింగు ఇసుక లారీ ఢీ కొట్టడంతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కాటారం మండల కేంద్రంలోని తోట రవి ఇసుక లారీ కారణంగా రెండు కాళ్లను కోల్పోయాడు. ఈ రెండు కుటుంబాలను పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ప్రకటించారు. ఇసుక మాఫియా కారణంగానే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఈ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విచారణ జరిపించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరుతానని వెల్లడించారు. టీఆర్ఎస్ పరిపాలనలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగానే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని, అయినప్పటికీ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయేంత నిర్లక్ష్యంగా నడుస్తున్న ఈ దందా గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెల్తానని ఎంపీ ప్రకటించారు. మంథని ప్రాంతంలోని సామాన్యులకు అన్యాయం జరగకుండా ఉండే విధంగా తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని ఎంపీ వంశీ హామీ ఇచ్చారు.


gaddam vamshikaleshwarammp vamshi krishnaPeddapalliSAND MAFIA