జగిత్యాలలో మరో సంచలనం…
దిశ దశ, కరీంనగర్:
అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లక్ష్యంగా జగిత్యాలలో కరపత్రాలతో యుద్దం మొదలైంది. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న వారిని కాదని ఇతర పార్టీల నాయకులకు బీఫామ్స్ ఇవ్వడంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నాయకులంతా స్వతంత్రులుగా పోటీ చేసి ప్రచారం చేస్తుండగా వారికి అండగా సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి నిలుస్తున్నారు. అయితే తాజాగా జగిత్యాల పట్టణంలో కరపత్రాలు వెలుగులోకి రావడంతో చర్చకు దారి తీసింది.
16 మంది కమిషనర్లు…
2019 నుండి ఇప్పటి వరకు జగిత్యాల మునిసిపల్ కమిషనర్లుగా 16 మంది బదిలీ అయ్యారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న 35 మంది అభ్యర్థులు గతంలో ఏ పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందేనని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. జగిత్యాల పట్టణ సామాన్య ఓటరు పేరిట విడులైన ఈ కరపత్రంలో ఊసరవెల్లిలో రంగులు మార్చి ఇప్పుడ మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం సిగ్గుచేటంటూ, వీరికి ఓట్లు వేయవద్దంటూ వేడుకుంటున్నారు. పార్టీకి సిగ్గులేకపోయినా సామన్య ప్రజలమైన మనకైనా ఆలోచన ఉండాలని, అధికార దాహం కోసం రంగులు మార్చేవారికి ఓటు వేయవద్దని, భారత రాజ్యాంగాన్ని కాపాడే విధంగా నిర్ణయం తీసుకుందామంటూ ఆ కరపత్రంలో ముద్రించారు. తాజాగా విడులైన ఈ కరపత్రాలు జగిత్యాలలోని వివిధ కూడళ్లతో పాటు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.