డ్రోన్ కెమెరాల వినియోగంపై బీఆర్ఎస్ నేతలపై కేసు….

దిశ దశ, భూపాలపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసు నమోదు అయింది. గత జులై 26న మేడిగడ్డ బ్యారేజీ సందర్శించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలను వినియోగించి వీడియో రికార్డు చేశారని ఇరిగేషన్ ఏఈఈ వలి షేక్ పిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 223(B), r/w 3(5) బీఎన్ఎస్ యాక్టలో కేసు నమోదు చేశారు.

ఫిర్యాదులో ఇలా…

ఇరిగేషన్ ఏఈఈ ఇచ్చిన ఫిర్యాదులో వివరించిన ప్రకారం జులై 26వ తేది మద్యాహ్నం 12.30 గంటల నుండి 2 గంటల మధ్య సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంటల్ తారక రామారావు పిలుపు మేరకు ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్, మరి కొంతమంది కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారని, ఈ సందర్శనకు సంబంధించి డ్రోన్ విజువల్స్ ఎలక్ట్రానికి మీడియాలో వీక్షించిన తరువాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని ఏఈఈ వెల్లడించారు. తెలంగాణకు ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఎలాంటి అనుమతి, సమాచారం ఇవ్వకుండా డ్రోన్ కెమెరాలను వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు జులై 29న మహదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

BRS NEWSBRS PARTYkaleshwarammedigadda barragetelangana police