దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ అభివృద్ది కోసం రూ. 1400 కోట్లు విడుదల చేశానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఓ జోక్ అని, రెండేళ్ల పాలనలో నయాపైసా కరీంనగర్ అభివృద్ది కోసం కెటాయించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చొప్పదండిలో సీఎం చేసిన ప్రసంగంపై బండి సంజయ్ విరుచకపడ్డారు. కరీంనగర్ కోసం నిధులు మంజూరు చేసిన వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. నన్ను కోసినా నయాపైసా లేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికలొస్తున్నాయని అబద్దాలాడుతున్నారని, దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. రోషం, పౌరుషం చచ్చిపోయిందని సీఎం ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూసుకుంటామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.