నిర్మల్ మునిసిపల్ ఆర్ఐ ట్రాప్…
దిశ దశ, నిర్మల్:
అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ యంత్రాంగంతో మిలాఖత్ అయి లంచం డబ్బులు తీసుకునేందుకు మీడియేటర్లుగా వ్యవహరిస్తున్న వారిని కూడా ఏసీబీ వదిలిపెట్టడం లేదు. లంచం తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారితో పాటు దళారీలను కూడా అరెస్ట్ చేస్తోంది. తాజాగా నిర్మల్ మునిసిపల్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… నిర్మల్ పట్టణంలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్న బాధితుడి ఇంటికి వాల్యూయేషన్ వేయడంతో పాటు ఇంటి నంబర్ అలాట్ చేసేందుకు మునిసిపల్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ (RI) గైక్వాడ్ సంతోష్ కుమార్ లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి వివరాలను వెల్లడించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎండీ షోయబ్ అహ్మద్ ద్వారా రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. గురువారం సాయంత్రం 4.50 గంటల సమయంలో బాధితుని నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అనంతరం నిందితులిద్దరిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు తరలించారు.