దిశ దశ, కాళేశ్వరం:
మూడు దశాబ్దాల క్రితం గోదావరి నది పుష్కరాల సమయంలో ఓ ప్రముఖ పుణ్య క్షేత్ర ఆలయ కమిటీ ఛైర్మన్ సాంప్రాదాయేతర దుస్తులు ధరించారు. ఆ క్షేత్ర దర్శనానికి వచ్చిన అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ ఛైర్మన్ ను పిలిచి సాంప్రాదాయ దుస్తులు వేసుకోవాలి, దేవాదాయ శాఖ సాంప్రాదాయాలు పాటించాలని సూచించారు. ఇదంతా గతం…
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగానిర్వహించిన అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలలో సాంప్రాదాయ దుస్తుల విధానాన్ని పాటించకుండానే ఆధ్యాత్మికకు భంగం కల్గించిన తీరు విస్మయానికి గురి చేసింది.
సామాన్యులయితే…
సామాన్య భక్తుడు వస్తే సాంప్రాదాయ దుస్తులు లేవని అభ్యంతరాలు చెప్పే దేవాలయ అధికారులు సరస్వతి పుష్కరాలలో ఈ విధానానికి పాతరేసినట్టుగా కనిపించింది. కొంతమంది ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు కూడా దర్జాగా పాయింట్లు వేసుకుని గర్భాలయంలోకి వచ్చినా అర్చకులు, దేవాలయ యంత్రాంగం పల్లెత్తుమాట అనకుండా సాదర స్వాగతాలు పలకడం విమర్శలకు దారి తీసింది. గర్భాలయంలోని శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వారి ఆర్జిత సేవల్లో సాంప్రాదాయేతర దుస్తులు ధరించే పాల్గొన్నారు కొంతమంది. ఉన్నతాధికారులు, ముఖ్య నాయకులంతా కూడా సాంప్రాదాయానికి ప్రాధాన్యం ఇస్తే దేవాదాయ శాఖకు చెందిన ఒకరిద్దరు ఉన్నతాధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం విడ్డూరం. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పీఠాధిపతులు ఎవరు వచ్చినా కొంతమంది మాత్ర సాంప్రాదాయ దుస్తుల ధరించకపోవడం ర్చనీయాంశం అయింది. సోమవారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా సాంప్రాదాయ దుస్తులు ధరించకపోవడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మంటగలపడమేనా..?
ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా ఆలయాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉంది. ఆలయంలో పని చేసే చిరుద్యోగి నుండి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ డ్రెస్ కోట్ పాటించాల్సిందే. తెల్ల పంచె, తెల్ల షర్టు ధరించి ఆచారాన్ని పాటించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు దేవాలయాల్లో. ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ అధికారులపై ఉంది. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి కూడా సాంప్రాదాయ దుస్తులు ధరించే ఆలయ ప్రాంగణంలో తిరిగారు. కానీ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు మాత్రం సాంప్రాదాయానికి విరుద్దంగా నడుచుకోవడానికే మొగ్గు చూపడం విచిత్రం. వీఐపీలు వచ్చినా వారికి జ్ఞాపికలు అందించేప్పుడు కూడా సాంప్రాదాయ దుస్తులు వేసుకునేందుకు ఆసక్తి చూపకపోవడం వెనక ఉన్న కారణం ఏంటన్నదే మిస్టరీగా మారింది. ప్రోటోకాల్ విభాగం కూడా ఈ విషయంపై అంతగా దృష్టి పెట్టకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వారంతా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ పాటించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ అలా నడుచుకునేందుకు చొరవ తీసుకోకపోవడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది.
కొత్తపాట…
గత కొంతకాలంగా కాళేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకునే వారు సాంప్రాదాయ దుస్తులను వేసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరం అర్చకులు, ఆలయ సిబ్బంది సరికొత్త పల్లవి అందుకున్నారు. గర్భాలయంలోకి సాంప్రాదేయ దుస్తులు వేసుకుని వచ్చినా తాము శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని తాకనివ్వలేదని, వారిచే ఆచారం ప్రకారం పంచామృతాలు ఉంచిన పాత్రలను తాకి నమస్కరించుకోవాలని సూచించి తామే అభిషేకం తంతు నిర్వహిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా అప్పటికప్పుడు తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్ప మరోటి కాదు. తిరుమల, తిరుపతిలో కేశ ఖండన చేసే నాయి బ్రాహ్మణులు, వివిధ సత్రాలలో డ్యూటీలో చేసే వారు, ఆర్జిత సేవా టికెట్లు ఇచ్చే వారు ఇలా ప్రతి ఒక్కరు కూడా డ్రెస్ కోడ్ పాటిస్తుంటారు. తిరుపతిలో TTD ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి చోట కూడా చిరుద్యోగి నుండి ఉన్నాతాధికారి వరకూ సాంప్రాదాయ దుస్తులు ధరించే కనిపిస్తారు. ఆలయ ఛైర్మన్, పాలకవర్గ సభ్యులు. ఈఓ ట్రెడిషనల్ దుస్తులు ధరించే పాలకవర్గ సమావేశాలకు హాజరు అవుతారు. మరో విశేషం ఏంటంటే వైష్ణవ సాంప్రాదాయ ఆలయాల్లో గర్భాలయంలోకి అర్చకేతరులు వెల్లే అవకాశం ఉండదు. అయినప్పటికీ ఆలయంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ, దర్శనానికి వెల్లే భక్తులు డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. కానీ శైవ క్షేత్రాల్లో గర్భాలయంలోకి వెల్లేందుకు అనుమతులు ఉన్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వరం క్షేత్రంలోని గర్భాలయంలోకి సాంప్రాదాయేతర దుస్తులు వేసుకొచ్చినా గర్భాలయంలోకి అనుమతించి స్వామి వార్లను తాకనివ్వలేదని చెప్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా వ్యవహరించాల్సిన దేవాదాయ శాఖ అధికారులు తాత్కాలిక ఉపశమనం కోసం అప్పటికప్పుడు సమాధానం చెప్పి తప్పించుకుంటున్నట్టుగా ఉంది. కానీ వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదని స్ఫష్టం అవుతోంది. ఏది ఏమైనా ఆలయ సాంప్రాదాయ విషయంలో మాత్రం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై ఉదాసీనత తగదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.