Sand: పార్కింగ్ ప్లేసులేవి… లారీలు ఎక్కడ ఆగుతున్నాయ్..?

మానకొండూరు, వీణవంక వాసుల కష్టాలు…

దిశ దశ, వీణవంక:

ఇసుక రీచుల నిర్వహణ చేపట్టిన టీజీఎండీసీ పట్టించుకోని వైఖరి అత్యంత విచిత్రంగా ఉంది. మానేరు నదిలో ఇసుక సేకరణ కోసం రీచులను ఏర్పాటు చేయడంపై సారించిన దృష్టిని వాటివద్ద ఏర్పాట్లు చేపట్టే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తోంది.

పార్కింగ్ ప్లేసులు ఎవీ..?

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం నుండి వీణవంక మండలం వరకు పలు ఇసుక రీచులు నిర్వహిస్తున్నారు. ఆయా రీచుల్లో ఇసుక సేకరణ కోసం కాంట్రాక్టు అప్పగించారు. అయితే రీచుల వద్ద స్టాక్ యార్డు కొనసాగించడంతో పాటు, ఇసుక లోడ్ చేసుకునేందుకు వచ్చే లారీలను పార్క్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలు కెటాయించాల్సి ఉంటుంది. కానీ మానకొండూరు, వీణవంక మండలాల్లోని క్వారీల్లో మాత్రం అలాంటి చొరవ తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. మానకొండూరు నుండి వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి వరకు కూడా లారీలన్నీ ప్రధాన రహదారిపైనే నిలిపవేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలు రేయింబవళ్లు మెయిన్ రోడ్డు పక్కన నిలిపి ఉంచడం వళ్ల సాధారణ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాత్రి వేళ్లల్లో అయితే అడపాదడపా తిరిగే వాహనా దారులు ఈ లారీల కాన్వాయిని చూసి భయం భయంగా ప్రయాణించాల్సి వస్తోంది. పార్కింగ్ ప్లేసుల కోసం TGMDC ప్రత్యేకంగా లీజు అమౌంట్ కూడా చెల్లిస్తున్నప్పటికీ లారీలు ఫోర్ లేన్స్ మీద పార్క్ చేయడం వెనక కారణం ఏంటన్నది అధికారులకే తెలియాలి.

ఆ విషయాన్ని మరిచారా..?

మానేరు నదిలో ఇసుక సేకరణ కేవలం ప్రభుత్వ అవసరాల కోసమేనని గతంలో నేషనల్ గ్రీన్ ట్యిబ్యూనల్ ముందు అధికారులు నివేదిక ఉంచారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని ఇసుక రీచులను కమర్షియల్ అవసరాల కోసం వినియోగించుకోవడం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇసుక రీచులు నడవనప్పటికీ ఇతర ప్రాంతాల్లో మాత్రం ఇసుక వ్యాపారం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో NGT తీర్పు వెలువరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు ఎన్టీజీ ఇచ్చిన తీర్పుపై స్టే మాత్రమే ఇచ్చింది కానీ ఇసుక సేకరించాలని ఆదేశాలు ఇవ్వనట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమయితే అధికారులు ఇసుక తవ్వకాల కోసం అనుమతులు ఎలా ఇచ్చారన్నదే పజిల్ గా మారింది. గతంలో కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిలో ఇసుక సేకరించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతులు ఇచ్చిన తరువాత వాటిని రద్దు చేస్తున్నట్టుగా మరో ఉత్తర్వు జారీ చేశారు. కానీ తిరిగి అదే చోట ఇసుక రీచులు నిర్వహిస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page