దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల కొత్త జాబితా తయారైనట్టుగా తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని విప్లవ పార్టీల సమూహంతో ఏర్పాటు చేసిన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI) కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులతో కూడిన ఓ జాబితా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు 22 మంది సభ్యులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 17కు తగ్గిపోయింది. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులే లక్ష్యంగా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుండడంతో ముఖ్య నాయకులను కోల్పోవలసి వచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్, సీసీ మెంబర్లు చలపతి, సుధాకర్ అలియాస్ గౌతంలు ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ కు చెందిన విక్రమం మాంజీ మరణించగా, సంజయ్ దీపక్ రావు అరెస్ట్ అయ్యారు. ప్రత్యామ్నాయ కేంద్ర కమిటీ సభ్యులను చేర్చుకోవడంతో ప్రస్తుతం కేంద్ర కమిటీలో 17 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్నిక ప్రక్రియ ఇంకా పెండింగులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
కమిటీ సభ్యులు వీరే…
ప్రస్తుతం కేంద్ర కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణాలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన ముప్పాళ లక్ష్మణ్ రావు @ గణపతి @ రామన్న @ శ్రీనివాస్, @ దయానంద్ @ రాజన్న @ చంద్రశేఖర్ @ గుడ్సా దాదా @ మల్లన్న @ శేఖర్ @ మహుదు, @ జీఎస్ @ మంగ్లు @ సమ్రూ తదితర పేర్లతో పార్టీలోనే కొనసాగుతున్నారు సీనియర్ నేత. 75 ఏళ్ల వయసులో ఉన్న ముప్పాళ ప్రస్తుతం కేంద్ర కమిటీ సలహాదారునిగా, సెంట్రల్ రీజనల్ బ్యూర్ మెంబర్ (CRBM), కేంద్ర కమిటీ సభ్యునిగా (CCM) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ విప్లవ సమూహాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శివాలం వీధికి చెందిన మలోఝ్జల వేణుగోపాల్ రావు @ వివేక్, @ భూపతి @ సోనూ @ లక్ష్మన్న @ రుషి @ అభయ్ తదితర పేర్లతో పిలుస్తారు. 70 ఏళ్ల వయసులో ఉన్న వేణుగోపాల్ ప్రస్తుతం పోలిట్ బ్యూర్ సభ్యునిగా (PBM), కేంద్ర కమిటీ సభ్యునిగా (CCM), సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శిగా (CRBS), అభయ్ పేరిట కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా, జనతన్ సర్కార్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన విద్యా విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన తిప్పిరి తిరుపతి @ దేవుజీ @ సంజీవ్ @ రమేష్ @ చేతన్ @ దేవన్న @ కొమ్ము దాదా తదితర పేర్లతో పిలుస్తున్నారు. 62 ఏళ్ల వయసులో ఉన్న తిప్పిరి తిరుపతి పోలిట్ బ్యూర్ మెంబర్ (PBM)గా, కేంద్ర కమిటీ సభ్యునిగా (CCM), సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యునిగా (CRBM), సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇంఛార్జిగా (CMC) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జార్ఖండ్ లోని గిర్డి జిల్లా పిర్టాండ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మదునాడికి చెందిన మిసిర్ బేస్రా @ సాగర్ @ సునిర్మాల్ @ సునీల్ తదితర పేర్లతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 63 ఏళ్ల వయసులో ఉన్న బేస్రా పొలిట్ బ్యూరో సభ్యునిగా (PBM), కేంద్ర కమిటీ సభ్యునిగా (CCM), సెంట్రల్ మిలటరీ కమిషన్ సభ్యునిగా (CMC), ఈస్ట్ రీజనల్ బ్యూరో మిలటరీ ఇంఛార్జిగా, అధికార ప్రతినిధిగా (ERB), వ్యవహరిస్తున్నారు. వీరందరికి కూడా రూ. కోటి చొప్పున రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోపాలరావుపల్లికి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి @ కోసా @ గౌతం @ సాధు @ గోపన్న @ వినోద్ @ బుచ్చన్న @ కాద్రి వంటి పేర్లతో పార్టీ కార్యకలపాల్లో నిమగ్నం అయ్యారు. 67 ఏళ్ల వయసులో ఉన్న కోసా కేంద్ర కమిటీ సభ్యునిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరో మెంబర్ గా, మాడ్ డివిజన్ ఏరియాకు గైడ్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్ కు చెందిన పుల్లూరి ప్రసాద్ రావు @ చంద్రన్న@ బాస్కర్ రావు @ శంకరన్న @ శంకర్ రావు తదితర పేర్లతో పార్టీలో కొనసాగుతున్నారు. 64 ఏళ్ల వయసులో ఉన్న చంద్రన్న కేంద్ర కమిటీ సభ్యునిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరో మెంబర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఇంఛార్జిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన మోడెం బాలకృష్ణ @ బాలన్న @ మనోజ్ @ రామచందర్ @ రాజేంద్ర @ భాస్కర్ @ గోల్కండ రాజేంద్ర @ చిన్ని వంటి పేర్లతో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. 61 ఏళ్లున్న బాలన్న కేంద్ర కమిటీ సభ్యునిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యునిగా, ఒడిషా రాష్ట్ర కమిటీ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెమ్ల గ్రామానికి చెందిన పాక హన్మంత @ ఉకె గణేష్ @ రాజేష్ @ తివారి @ సోమ్రూ వంటి పేర్లతో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు. పాక హన్మంతు కేంద్ర కమిటీ సభ్యునిగా, ఒడిషా రాష్ట్ర కమిటీ ఇంచార్జి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిర్డి జిల్లా దుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జార్వాలేకు చెందిన అనల్ దా @ తుఫాన్ దా @ పతిరాం @ మాంజీ @ పతిరాం మరాండి @ రమేష్ తదితర పేర్లతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 57 ఏళ్ల వయసులో ఉన్న తుఫాన్ దా కేంద్ర కమిటీ సభ్యునిగా, బీహార్, జార్ఖండ్ సెక్రటరీగా, ఈస్ట్ రీజనల్ బ్యూరో సభ్యునిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ సభ్యునిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. తెలంగాణాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి @ గణేష్ @ ఉదయ్ తదితర పేర్లతో పార్టీలో కొనసాగుతున్నారు. 59 ఏళ్ల గణేస్ కేంద్ర కమిటీ సభ్యునిగా, ఆంధ్రా ఒడిశా బార్డర్ కార్యదర్శిగా (AOB), సెంట్రల్ మిలటరీ కమిషన్ సభ్యునిగా, సెంట్రల్ రీజనల్ బ్యూర్ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన కట్ట రామచంద్రా రెడ్డి @ రాజు దాదా @ గుడ్సా ఊసెండి @ రాజు @ విజయ్ @ ఉదయ్ @ వికల్ప్ @ సునీల్ పేర్లతో పార్టీలో కొనసాగుతున్నారు. 63 ఏళ్ల కేంద్ర కమిటీ సభ్యునిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా (DKSZC), వికల్ప్ పేరిట అధికార ప్రతినిధిగా, దండకారణ్య ప్రెస్ యూనిట్ ఇంఛార్జిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యునిగా, జనతన్ సర్కార్ ఆర్పీసీ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరికి రూ. 40 లక్షల చొప్పున రివార్డులను ప్రకటించింది ప్రభుత్వం. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా భైరంఘడ్ కు చెందిన మాజిదేవ్ @ రామ్ ధీర్ గా పార్టీలో కొనసాగుతున్న ఈయన 56 ఏళ్ల వయసులో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యునిగా, సెంట్రల్ రీజనల్ బ్యూర్ సభ్యునిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ SMC ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని శాస్త్రుల్లపల్లికి చెందిన మల్ల రాజిరెడ్డి @ సంగ్రామ్ కేంద్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి @ విశ్వనాథ్ @ సంతోష్ 58 ఏళ్ల వయసులో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యునిగా, ఈస్ట్ రీజనల్ సభ్యునిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ సభ్యునిగా పనిచేస్తున్నారు. జార్ఖండ్ లోని హజారిబాద్ జిల్లా విష్ణుగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాండేరికి చెందిన సహదేవ్ సోరెన్ @ అంజూ @ పర్వేశ్ @ అమ్లేశ్ కేంద్ర కమిటీ సభ్యునిగా, ఈస్ట్ రీజనల్ బ్యూరో సభ్యునిగా పని చేస్తున్నారు. తెలంగాణాలోని పెంచికల్ పేట సమీపంలోని గట్టు గ్రామానికి చెందిన పోతుల కల్పన @ మైనక్క 61 ఏళ్ల వయసులో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యురాలిగా, జనతన్ సర్కార్ ఇంఛార్జిగా పని చేస్తున్నారు. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా బండిగూడ, పువ్వర్తి గ్రామానికి చెందిన మాడావి హిడ్మా @ సంతోష్ 51 ఏళ్ల వయసులో ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యునిగా దండకారాణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా (DKSZC), పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ ఇంఛార్జిగా పని చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మొత్తం 17 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా వీరిలో తెలంగాణాకు చెందిన వారు 12 మంది, జార్ఖండ్ కు చెందిన వారు ముగ్గురు, చత్తీస్ గడ్ కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు.
కార్యదర్శి ఎవరూ..?
మే 21న దండకారణ్యంలో జరిగిన ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు మరణించారు. మావోయిస్టు పార్టీకి కంచుకోటగా మారిన దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ ముఖ్య నాయకత్వాన్ని ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే విప్లవ చరిత్రలో చారు మజుందార్ తరువాత కేంద్ర కమిటీ కార్యదర్శి హోదాలో ఉన్న నంబళ్ల కేశవ రావు ఎదురు కాల్పుల్లో మరణించారు. సుదీర్ఘ కాలం విప్లవ పంథాలో కొనసాగిన బసవరాజ్ ఎన్ కౌంటర్ పై అంతర్జాతీయ విప్లవ సంస్థలు కూడా ఖండించాయి. కేశవ రావు మరణించిన తరువాత పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారోనన్న చర్చ జరుగుతున్నప్పటికీ పార్టీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీనియర్ నాయకుడు ముప్పాళ లక్ష్మణ్ రావు పర్యవేక్షణలోనే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టుగా సమాచారం. ఇంకా పార్టీ కార్యదర్శి బాధ్యతలు మాత్రం ఎవరికీ అప్పగించనట్టుగా తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత కోసం బలగాలు ముప్పేట దాడులు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించేందుకు ముఖ్య నాయకత్వం సమావేశం అయ్యే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లలో కేంద్ర కమిటీ బాధ్యులు మరణించడం, అరెస్ట్ కావడం వంటి కారణంగా కొత్త వారికి కేంద్ర కమిటీలో అవకాశం కల్పించినట్టుగా స్ఫష్టం అవుతోంది. అయితే పార్టీలో ప్రత్యామ్నాయంగా కేంద్ర కమిటీ సభ్యులను ముందుగానే ప్రకటించుకునే సాంప్రాదాయం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా వారిని సీసీ కమిటీకి ప్రమోట్ చేసినట్టుగా భావిస్తున్నారు. కార్యదర్శిగా మల్లోజ్జుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ పేర్లు వినిపించినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.