దిశ దశ, హైదరాబాద్:
అవినీతి నిరోధక శాఖ ఇరిగేషన్ ఇంజనీర్లపై దాడులు చేస్తుండడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజనీర్లే లక్ష్యంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు అవుతున్న తీరు ఆశాఖ అధికారులను కలవరపెడుతోంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ నెక్స్ట్ టార్గెట్ ఎవరూ అన్న చర్చ మొదలైంది ఇరిగేషన్ విభాగంలో.
ఇద్దరిపై కేసు…
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ENCగా పని చేస్తున్న భూక్యా హరి రామ్ పై కేసు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన హరి రామ్ పై దాడులు చేయడంతోనే ఇరిగేషన్ ఇంజనీర్లలో ఉలికిపాటు మొదలైంది. అప్పుడు ఏక కాలంలో 13 చోట్ల దాడులు చేసిన ఏసీబీ ENC హరిరామ్ కు సంబంధించిన అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో హరిరామ్ ఆస్తులను గుర్తించిన ఏసీబీ ఏపీ రాజధాని అమరవాతిలో కూడా ఆయనకు స్థిరాస్తులు ఉన్నట్టు తేల్చింది. విల్లాలు, ఇండ్లు, నిర్మాణంలో ఉన్న భవనం, రెండు చోట్ల ఓపెన్ ప్లాట్లు, 28.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఎకరాల్లో ఫార్మ్ హౌజ్ నిర్మించి ఉన్న మామిడి తోట, మార్కుక్, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడ, గాజుల రామారం, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ENC హరిరామ్ కు విలువైన ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. తాజాగా చొప్పదండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE)గా పని చేస్తున్న నూనె శ్రీధర్ పై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ బృందాలు బహిరంగ మార్కెట్ లో రూ. 200 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో శ్రీధర్ ను కూడా అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆయన నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేశారు. కోర్టు అనుమతి ఇచ్చిన తరువాత ఆయనకు ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి..? బినామీలు ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో కూడా వివరాలు సేకరించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
సీనియర్ ఇంజనీర్ పై..?
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా పని చేసిన మరో సీనియర్ ఇంజనీర్ ఆస్తుల వివరాలను కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి సోదాలు నిర్వహించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే సదరు అధికారి ఇతర దేశాల్లో జీవనం సాగిస్తున్న తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆదాయాన్ని గడించినట్టుగా లెక్కలు చూపినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇరిగేషన్ వర్గాల్లో మాత్రం చర్చ సాగుతోంది. అయితే సదరు అధికారి తన ఆస్తుల విషయంలో అంతా సవ్యంగా ఉన్నారని లెక్కలు చూపడంతో సేఫ్ అయిపోయారని కూడా నీటి పారుదల శాఖ వర్గాలు అనుకుంటున్నాయి. ఒకవేళ ఏసీబీ సదరు సీనియర్ ఇంజనీర్ ఆస్తుల విషయంలో దాడులు చేసినట్టయితే ఆయన చూపించిన ఆదారాలతో మాత్రం ఏసీబీ సంతృప్తి చెందే అవకాశం అయితే ఉండదు. సదరు అధికారికి విదేశాల నుండి వచ్చిన డబ్బు ఎంత..? అక్కడి నుండి పంపిన వారు ఏం పని చేస్తున్నారు..? వారికి అక్కడ వస్తున్న ఆదాయం ఎంత..? విదేశాల్లో స్థిరపడ్డ సదరు అధికారి కుటుంబ సభ్యుల మెయింటనెన్స్ కు అయ్యే ఖర్చులు ఎంత తదితర వివరాలను కూడా సేకరించి ఆరా తీసే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. సదరు అధికారి అందించిన వివరాలకు, విదేశాల్లో స్థిరపడ్డ వారి లావాదేవీలకు పొంతన లేనట్టయితే కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తారు. అలాగే విదేశాల్లో స్థిరపడ్డ వారు పంపిన నగదుకు సరైన ఆధారాలు లేనట్టయితే ఆ డబ్బు వారికి ఎలా వచ్చింది అన్న విషయంపై కూడా ఏసీబీ దృష్టి సారించనుంది. విదేశాల్లో స్థిరపడిన వారు వైట్ మని చూపించలేనట్టయితే మాత్రం వారు కూడా చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోవడంతో పాటు హవాలా ద్వారా డబ్బు బదిలీ అయిందా అన్న కోణంలో కూడా ఆరా తీసే అవకాశాలు ఉంటాయి. నగదు బదిలీ చేసిన విషయంలో అకౌంటబులిటీ లేనట్టయితే ఏసీబీ అధికారులు హవాలాకు పాల్పడినట్టుగా నిర్దారణ చేసినట్టయితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగడం పక్కా. ఈడీ ఎంట్రీ తరువాత విదేశాల నుండి నగదు వచ్చిందని చెప్పి తప్పుడు ఆధారాలు చూపించిన అధికారులు మరింట ఝటిలమైన పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది.
ఎవరెవరో..?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇరిగేషన్ ఇంజనీర్లను ఏసీబీ భయం వెంటాడుతున్నట్టుగా ఉంది. అప్పుడు కీలకంగా వ్యవహరించి అక్రమంగా ఆదాయం అర్జించిన వారిని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్న తీరును గమనిస్తే తెలంగాణ ఏసీబీ అధికారులు పక్కాగా ఆధారాలు సేకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. రానున్న కాలంలో ఇంకా ఎంతమందిపై దాడులు జరిగే అవకాశం ఉందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఏసీబీ అధికారుల తీరును గమనిస్తే మాత్రం ఉన్నతాధికారులే లక్ష్యంగా దాడులు చేస్తుండడంతో ఖచ్చితంగా మరికొంతమంది సీనియర్ ఇంజనీర్లపై దాడులు చేసే అవకాశం ఉంటుందన్న నీటి పారుదల విభాగంలో చర్చ సాగుతోంది. ఏసీబీ తయారు చేసుకున్న చిట్టాలో ఎంతమంది అధికారులు ఉన్నారు..? ఎవరెవరు ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టుకున్నారు..? బినామీలు ఎవరూ అన్న పూర్తి వివరాలు సేకరించిందని దాడులు చేసిన అధికారి పక్కాగా దొరికిపోతారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. మరో వైపున కొండపోచమ్మ సాగర్ నిర్మాణంపై కూడా విజిలెన్స్ విచారణ జరగనున్న నేపథ్యంలో ఇరిగేషన్ విభాగం అధికారులను మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నెల 26 నుండి జూన్ 4వ తేది వరకు విచారణకు హాజరు కావాలని 63 మంది ఇంజనీర్లకు విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో కాళేశ్వరం తప్పిదాలపై విచారణ ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.