సిరిసిల్లలో ఉద్రిక్తత… కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్…

స్వల్ప లాఠీ ఛార్జ్… స్టేషన్ కు తరలింపు…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలొకొన్న ప్రోటోకాల్ వివాదం ముదిరిపాకాన పడినట్టుగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య గత కొద్దిరోజులు ప్రోటోకాల్ అంశం రగులుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో అడుగు ముందుకు వేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి, తెలంగాణ తల్లి విగ్రహం లేదని, ఇది ప్రోటోకాల్ కు విరుద్దమని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు ఆఫీసు వైపు దూసుకెల్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి విగ్రహాలను తీసుకుని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి వెల్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల చర్యలను వ్యతిరేకేంచారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఇరు పార్టీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం ఎంటని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదని స్థానిక కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ ప్రశ్నించారు. అధికారిక భవనంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి కానీ మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఉండడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్న కెకె మహేందర్ రెడ్డి ప్రోటో కాల్ కు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తన ఫోటో పెట్టడం లేదంటూ కేటీఆర్ తన అచరులతో ప్రశ్నిస్తున్నారని అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటో లేకపోవడం వెనక కారణమేంటని అడిగారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రోట్ కాల్ కు విరుద్దంగా భద్రాద్రి రామచంద్రుని ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించింది కేటీఆర్ తనయుడేనని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యక్రమంలో ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క పట్ల ప్రోటో్కాల్ విరుద్దంగా వ్యవహరించారన్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాబీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య కూడా చాలా సందర్భిాల్లో ప్రోటోకాల్ కు విరుద్దంగా నడుచుకున్నారని టోని ప్రవీణ్ ఆరోపించారు. ప్రభుత్వ భవనం అయిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం కూడా ప్రోటోకాల్ కు వ్యతిరేకమేనని స్ఫష్టం చేశారు. ఈ కారణంగానే తాము తెలంగాణ తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో క్యాంపు ఆఫీసు భవనంలో ఏర్పాటు చేసేందుకు వెళ్లామని వెల్లడించారు.

లాఠీ చార్జ్…

మరో వైపున ప్రోటోకాల్ రచ్చ తీవ్రంగా సాగడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఇరుపార్టీల వారిని నిలువరించాల్సిన పరిస్థితి తయారైంది. ఒకదోశలో తోపులాట తీవ్రతరం కావడం, కట్టడి చేయలేని పరిస్థితి నెలకొనడంతో పోలీసులు లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులను సిరిసిల్ల ఠాణాకు, బీఆర్ఎస్ నాయకులను తంగళ్లపల్లి స్టేషన్ కు తరలించారు. అయితే ఈ ఘటనలో సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణకు గాయం కాగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కూడా లాఠీ ఛార్జిలో గాయపడ్డారు.

బీఆర్ఎస్ నిరసన…

తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడ్డ బీఆర్ఎస్ నాయకులకు చికిత్స అందిస్తున్న క్రమంలో స్టేషన్ వద్దకు చేరుకున్న పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది.

You cannot copy content of this page