12 చోట్ల ఏక కాలంలో తనిఖీలు…
దిశ దశ, హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన మరో సీనియర్ ఇంజనీర్ ఆస్తులపై తెలంగాణ ఏసీబీ దాడులు మొదలు పెట్టింది. రిటైడ్ ఈఎన్సీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సదరు ఇంజనీరును ఏసీబీ టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పలు చోట్ల పని చేసిన నూనె శ్రీధర్ కు చెందిన ఆస్తులపై తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ACB) బుధవారం తెల్లవారు జాము నుండి దాడులు చేయడం ఆరంభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 12 చోట్ల సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం. హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్ తో పాటు పలు చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ అండర్ టన్నెల్, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం, రామగుండం సమీపంలోని గోలివాడ పంప్ హౌజ్ లకు ఇంఛార్జిగా ఎస్ఈ హోదాలో పని చేస్తున్నట్టుగా తెలస్తోంది. లక్ష్మీపూర్ అండర్ టన్నెల్ నిర్మాణ సమయంలో ఈఈ హోదాలో వ్యవహరించిన నూనె శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో ఆయన ఒకరుగా పేరుంది. అయితే కరీంనగర్ లోని వర్క్ షాప్ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న శ్రీధర్ ను బుధవారం వేకువ జామునే ఏసీబీ అధికారులకు సంబంధించిన స్పెషల్ టీమ్ వచ్చి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఫ్లాట్ కు లాక్ చేసి ఉండగా, జ్యోతినగర్ లో నివాసం ఉంటున్న నూనె శ్రీధర్ సమీప బంధువుల ఇంటిలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు అదికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కొన్ని గంటల్లో విచారణకు కేసీఆర్…
మరో వైపున తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా మరికొన్ని గంటల్లో జస్టిస్ ఘోస్ కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. బుధవారం 11.30 గంటల సమయంలో కేసీఆర్ హైదరాబాద్ లోని బూర్గుల రామకృష్ణారావు భవన్ లోని జస్టిస్ ఘోస్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఘోష్ కమిషన్ కూడా కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇదే రోజున ఏసీబీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు SE నూనె శ్రీధర్ ఆస్తులపై దాడులు చేపట్టడం గమనార్హం.