జీవన్ రెడ్డి ఎపిసోడ్… రంగంలోకి ఏఐసీసీ పెద్దలు…

దిశ దశ, జగిత్యాల:

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డితో మాట్లాడేందుకు ఏఐసీసీ నాయకులు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకుంటారని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆయనతో ఫోన్ లో సంప్రదింపులు జరపడం గమనార్హం. పార్టీలోనే కొనసాగాలని మంచిరోజులు వస్తాయని మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో అన్నట్టుగా సమాచారం. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి కూడా తన పట్ల చూపిన వివక్ష గురించి మీనాక్షి నటరాజన్ కు వివరించినట్టుగా తెలుస్తోంది. తాను సాధారణ మునిసిపల్ ఛైర్ పర్సన్ పదవిని తన అనుచరులకు ఇవ్వాలని అడిగినా లాభం లేకుండా పోయిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. తనను కావాలనే పార్టీ నుండి పంపిచే విధంగా నడుచుకుంటున్నారని వెల్లడించినట్టుగా సమాచారం. పార్టీ మారే యోచనపై మాత్రం జీవన్ రెడ్డి మీనాక్షి నటరాజన్ కు స్పష్టత ఇవ్వనట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.