Kaleshwaram: కాళేశ్వరం ఇంజనీర్లకు శ్రీముఖాలు…

38 మంది సంజాయిషీ కోరిన అధికారులు…

దిశ దశ, కాళేశ్వరం:

మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. విజిలెన్స్ నివేదిక ఆదారంగా 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో చర్చల తరువాత ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవడం గమనార్హం. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రస్తుతం వివిధ హోదాల్లో పని చేస్తున్న వారికి షోకాజ్ లు ఇచ్చిన నీటిపారుదల శాఖ ఉన్నతాదికారులు 3 వారాల్లో సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేసింది. లేనట్టయితే విజిలెన్స్ నివేదిక ఆధారంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మేడిగడ్డ కుంగుబాటుతో…

మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకులో ఓ పిల్లర్ కుంగిపోవడం, దాని ప్రభావంతో మరిన్ని పిల్లర్లు దెబ్బతినడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బృందాలు కేత్ర స్థాయిలో విచారణ జరిపాయి. ఈఎన్సీ కార్యాలయాలు, ప్రాజెక్టు ప్రాంతాలు అన్ని చోట్ల రికార్డులను స్వాధీనం చేసుకుని సమగ్ర అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చిలో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన కమిషన్ ఆమోదముద్ర వేసింది. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోందని నాలుగైదు రోజులుగా చర్చ జరిగింది. 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు, 33 మంది ఇంజనీర్లకు జరిమానా, ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లకు పెన్షన్ నుండి కూడా రికవరి చేయవచ్చని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. అయితే విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడం కొత్త మలుపు తిరిగినట్టయింది. షోకాజ్ నోటీసులు అందుకున్న ఇంజనీర్లు ఇచ్చే సంజాయిషీతో సంతృప్తి చెందినట్టుగా ఫైల్ క్లోజ్ చేస్తారా లేక వారిపై చర్యలు తీసుకుంటారా అన్నది ఆ తరువాత తేలనుంది.

You cannot copy content of this page