దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు చతకిలపడిపోయాయి. గత ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకున్న రెండు పార్టీలు ఈ సారి బోటాబోటి ఫలితాలను అందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించే అవకాశాలు ఉంటాయని, రెండు పార్టీల మద్దతు తప్పని సరి అన్న అంచనాలు వేసినా నామమాత్రపు సీట్లతోనే సరిపెట్టుకున్నాయి. అన్ని పార్టీలను తలదన్నేలా బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకోవడం ఓ ఎత్తైయితే… బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు గెల్చిన స్థానాలు ఆ పార్టీల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. గత పాలకవర్గంలో 33 స్థానాలతో ఆదిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ ఈ సారి కేవలం 9 స్థానాలతోనే సరిపెట్టుకోవడం గమనార్హం. ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు కరీంనగర్ అంతటా ప్రచారం నిర్వహించినా టఫ్ ఫైట్ మాత్రం ఇవ్వలేని పరిస్థితికి చేరడం విస్మయానికి గురి చేస్తోంది. సానుభూతితో గెల్చిన స్థానాలను మినహాయిస్తే బీఆర్ఎస్ ప్రభావంతో గెల్చిన స్థానాలు తక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎంఐఎం…
పార్టీ చీఫ్ అసుదుద్దీన్ ఓవైసీ, అగ్రనేత అక్బురుద్దీన్ ఓవైసీలు ప్రచారం చేసినప్పటికీ ఎంఐఎం కనివిని ఎరగని రీతిలో విఫలం అయింది. గతంలో కార్పొరేషన్ లో తీవ్రమైన ప్రభావాన్ని చూపిన ఎంఐఎం ఈ సారి మాత్రం పోటీ ఇచ్చిన దాఖలాలే కనిపించలేదు. ఇటీవలి పాలకవర్గంలో 6 స్థానాలు గెల్చుకున్న ఎంఐఎం ఈ సారి అందులో సగం మాత్రమే గెల్చుకుందంటే ఆ పార్టీ ఏ స్థాయిలో విఫలం చెందిందో అర్థం చేసుకోవచ్చు. అంతర్గత వర్గ విబేధాలతో పాటు ఆదిపత్య పోరు కూడా ఎంఐఎంను పుట్టి ముంచినట్టుగా స్ఫష్టం అవుతోంది.

