దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా పోయినప్పటికీ రిక్రూట్ మెంట్ ఎలా సాగుతోందన్న విషయం అంతు చిక్కకుండా పోయింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయినప్పటికీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన యువత అడవుల బాట పడుతున్న తీరు నిఘావర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అజ్ఞాతంలోకి…
2005 తరువాత ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. దళాలు కూడా సంచరించలేని పరిస్థితులు నెలకోవడంతో పార్టీ శ్రేణులంతా కూడా చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాలను షెల్టర్ జోన్ గా చేసుకున్నాయి. మొదట్లో చందూరు, దుద్దెడతొ కొన్ని గ్రామాలు మాత్రమే NTSZCకి షెల్టర్ పాయింట్లుగా దండకారణ్య కమిటీ కెటాయించింది. క్రమక్రమంగా ఏపీ, తెలంగాణాలో పార్టీ పూర్తిస్థాయిలో బలహీనపడిపోయింది. సరిహధ్దు ప్రాంతాలే లక్ష్యంగా ఉమ్మడి రాష్ట్ర బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో పార్టీ బలహనపడిపోయి NTSZC స్థానంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పడింది. మావోయిస్టు పార్టీ కూడా తెలంగాణ కమిటీకి దండకారణ్య ప్రాంతానికే పరిమితం కావల్సి వచ్చింది. ఇంతవరకు తాము సక్సెస్ అయ్యామని భావించిన తెలుగు రాష్ట్రాల పోలీసులకు ఇటీవల దండకారణ్యంలో జరుగుతున్న పరిణామాలు ఉలిక్కిపడేలా చేసినట్టయింది. పార్టీ ఉనికి లేకున్నప్పటికీ తెలంగాణ, ఏపీలకు చెందిన వారు అడవి బాట పడుతున్న విషయం వెలుగులోకి రావడంతో నిఘా వర్గాలు ఒక్కసారిగా అలెర్ట్ అయినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
అదెలా…
మావోయిస్టు పార్టీకి బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా చనిపోతుంటారు. అయితే వీరంతా కూడా దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెల్లిన వారే కావడంతో అప్పటి జనరేషన్ మాత్రమే విప్లవోద్యమాల్లో ఉందని అంచనా వేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో దండకారణ్యంలో జరుగుతున్న పలు ఘటనల్లో న్యూ జనరేషన్ కూడా పార్టీలో పని చేస్తున్నారన్న విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. వీరికి విప్లవ పాఠాలు ఎవరు నేర్పారు..? వీరు అజ్ఞాతంలో చేరే విధంగా వ్యవహరించింది ఎవరూ అన్న కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మేడ్చల్ కు చెందిన బంటి రాధ అలియాస్ నీల్సో కోవర్టుగా మారిందని మావోయిస్టులు హత్య చేశారు. కానీ అప్పుడు అడవి బాట పట్టిన యువతపై అంతగా దృష్టి పెట్టలేకోపోయారు. కానీ ఇటీవల జరుగుతున్న ఎన్ కౌంటర్లలో కొత్త తరం కూడా చనిపోతున్నది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. నక్సలిజం గురించి ఏ మాత్రం తెలియని నేటి తరానికి చెందిన యువత ఎలా అడవులకు వెల్లింది… వారిని మోటివేషన్ చేసిన వారు ఎవరూ అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. కర్రెగుట్ట, నారాయణపూర్ ఎన్ కౌంటర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత చనిపోవడంతో ఇంటలీజెన్స్ వర్గాలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లలో చనిపోయిన వారంతా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వారో లేక అక్కడ విద్యనభ్యసించేందుకు వచ్చినవారో ఉండడంతో నిఘా వర్గాలు మహానగరంలో అసలేం జరుగుతోంది అన్న విషయాలు తెలుసుకునే పనిలో పడినట్టుగా సమాచారం. వీరిలో చాలా మంది కూడా గత పదేళ్లలోనే రిక్రూట్ అయ్యారని కూడా నిఘా వర్గాలు గమనించడం విశేషం.
పోయిన చోటే…
పీపుల్స్ వార్ ఉద్యమ ప్రస్తానం నుండి కూడా రిక్రూంట్ మెంట్ సైద్దాంతిక నిర్మాణం జరిగిన తరువాతే జరిగేది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ బలోపేతం అయిన తరువాత రిక్రూట్ మెంట్ విషయంలో చూసిచూడనట్టుగా వ్యవహరించింది. పీపుల్స్ వార్ ప్రారంభం నుండి చాలా కాలం వరకూ కూడా విద్యావంతులు మాత్రమే రిక్రూట్ అయ్యేవారు. ఈ విధానాన్ని పక్కనపెట్టి పార్టీలో చేరేందుకు వచ్చిన వారందరిని చేర్చుకోవడం వల్ల కూడా పార్టీ వీక్ కావడానికి ఉన్న కారణాల్లో ఒకటిగా నాయకత్వం భావిస్తోంది. అయితే తాజాగా మావోయిస్టు పార్టీ సైద్దాంతికంగా పరిపూర్ణులుగా తయారు చేసిన వారినే యూజీలోకి తీసుకుంటున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇందుకు తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుండి జరుగుతున్న రిక్రూట్ మెంట్ విధానమే ప్రతక్ష్య సాక్ష్యంగా నిలుస్తోందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ప్రొఫెషన్ కోర్సులు, సాధారణ విద్యలో డిగ్రీ చదివిన వారు మాత్రమే అజ్ఞాతంలోకి వెలుతున్నారన్న విషయాన్ని కూడా గమనించిన నిఘా వర్గాలు మరింత లోతుగా ఆరా తీసే పనిలో పడినట్టుగా తెలుస్తోంది. రూపాయి పోయిన చోటే వెతుక్కోవాలన్న నినాదాన్ని బలంగా నమ్మే మావోయిస్టు పార్టీ విప్లవభావాజాలాన్ని నింపే పనిలో నిమగ్నం అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కు చెందిన వారు పని చేస్తున్నారని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది.