ఇరిగేషన్ EE నూనె శ్రీధర్ తీరు…
దిశ దశ, కరీంనగర్:
ఇరిగేషన్ విభాగంలో కొంతమంది ఇంజనీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారా? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఏసీబీ అసెట్స్ కేసు నమోదు చేసిన తర్వాత నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇరిగేషన్ విభాగంలో ముఖ్యమైన బాధ్యతల్లో అధికా,రుల అండదండలు కూడా ఆయనకు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
బొజ్జా ఆదేశాలే…
ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆదేశాలు కూడా పట్టించుకోకుండా నడుచుకున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం జూన్27న నూనె శ్రీధర్ ను చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని రాహుల్ బొజ్జా ఆదేశించినా ఏడాది పాటు చొప్పదండిలోనే EEగా కొనసాగుతున్నారని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు అమలు చేయకుండా వాటిని ENC పక్కన పెట్టేశారని గుర్తించారు. సదరు ENC ఈ విషయంలో అంత చొరవ తీసుకోవడానికి కారణం ఏంటన్న విషయంపై ఆరా తీయనున్నట్టు సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇరిగేషన్ విభాగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న రాహుల్ బొజ్జా ఆదేశాలనే ధిక్కరించేంత సాహసం చేయడం వెనక ఉన్న బలమైన కారణం ఏమై ఉంటుందోనన్న చర్చ సాగుతోంది.
కస్టడీ పిటిషన్…
మరో వైపున ఏసీబీ అధికారులు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు సమాయత్తం అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన శ్రీధర్ నుండి మరిన్ని వివరాలు రాబట్టాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయనను వారం రోజుల పాటు విచారించాల్సి ఉందని, తమ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు.
బినామీలపై ఆరా?
EE నూనె శ్రీధర్ ఆస్తులతో పాటు బినామీలు ఎవరెవరు ఉన్నారు? వారి వద్ద ఉన్న ఆస్తుల వివరాలను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది చిట్టా సేకరించిన ఏసీబీ శ్రీధర్ నుండి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నూనె శ్రీధర్ భారీగా అక్రమ ఆదాయం గడించారని అనుమానిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో రూ. 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, నగదు, బంగారం, వాహనాలను గుర్తించారు ఏసీబీ అధికారులు.