Telngana Crime: గుప్త నిధులు తీయక పోతే ప్రాణాలకే ప్రమాదం…

నకిలీ స్వాముల అరెస్ట్…

దిశ దశ, కరీంనగర్:

అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను కాపాడుకోవాలనుకున్న ఓ తనయుడిని భయాందోళనకు గురి చేశారు నకిలీ స్వాములు. ఇంట్లో ఉన్న గుప్త నిధులు ఉన్నాయని వాటిని వెలికి తీయనట్టయితే పేరెంట్స్ చనిపోతారంటూ హెచ్చరించి మోసాలకు పాల్పుడుతున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ అందించిన వివరాల ప్రకారం… కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన గజ్జి ప్రవీణ్ అనే యువకుడి తండ్రి ఆర్టీసీ డ్రైవర్ కాగా రోడ్డు ప్రమాదంలో కాలు విరగగా, అతని తల్లి కూడా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దాదాపు 15 రోజుల క్రితం గజ్జి ప్రవీణ్ కు ఓ స్వామి పరిచయం అయి అతని పరిస్థితి తెలుసుకుని భయాందోళనకు గురి చేశాడు. ఇంటి ఆవరణలో క్వింటాలు వరకు బంగారం ఉందని, పూజలు చేసి బంగారాన్ని బయటకు తీయనట్టయితే తండ్రి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని, నెల రోజుల్లో ఆయన చనిపోతాడని ఆ స్వామి ప్రవీణ్ ను హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన ప్రవీణ్ స్వామి చెప్పినట్టుగా నడుచుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఇదే అదనుగా భావించిన ఆ స్వామి బంగారం బయటకు తీసేందుకు పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పి విడుతల వారిగా రూ. 15.30 వేల నగదు ప్రవీణ్ నుండి వసూలు చేశాడు. ఓ రోజున పూజా సామాగ్రి తీసుకుని వచ్చిన స్వామి ఇంటి సమీపంలో ఓ గొయ్యిని తవ్వి ఏవేవో పూజలు చేసినట్టుగా నటించాడు. అనంతరం ఓ డబ్బా బయటకు తీశానని అందులో కిలో బంగారం ఉంటుందని పూజ గదిలో ఉంచాలని సూచించారు. అనంతరం ఇంకా తమకు డబ్బు కావాలని లేనట్టయితే ప్రవీణ్ తండ్రిని చంపి అక్కడే పాతి పెడతామని బెదిరిస్తూ మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో గజ్జి ప్రవీణ్ వారు అడిగినంత నగదు చెల్లించేందుకు అప్పులు చేసి ఆ స్వామికి ముట్టజెప్పాడు. నకిలీ స్వామితో పాటు మరికొంత మంది కలిసి తనను ఛీటింగ్ చేస్తున్నారని గమనించిన గజ్జి ప్రవీణ్ కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రగిరికి చెందిన ఈర్నాల రాజు, అగ్రహారంకు చెందిన మిరియాల దుర్గయ్య, చీర్లవంచకు చెందిన పెనుగొండ రాజు, చల్ల అజయ్, ఈర్నాల సతీష్ లు ఓ ముఠాగా ఏర్పడి ఇలాంటి దందాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేశామని ఏసీపీ శుభం ప్రకాష్ తెలిపారు. నిందితుల నుండి రూ. 15 లక్షల 30 వేల నగదు, 7 తులాల బంగారం, మూడు కార్లు ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, కరీంనగర్ రూరల్ ఏఎస్సై లక్ష్మారెడ్డిలను సీపీ గౌస్ ఆలం, ఏఎస్పీ శుభం ప్రకాష్ లు అభినందించారు. పూజలు చేస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరిన ఆయన వీరి బాధితులు ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలన్నారు.

You cannot copy content of this page