దిశ దశ, కాళేశ్వరం:
అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాల్లో ఎట్టకేలకు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఎంపీని ఆహ్వానించడంతో పాటు మంత్రి సీతక్క ఆయనను వెంట తీసుకుని కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు నడుచుకున్నారని, దళిత ఎంపీకి ఆహ్వానం పలికారంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎంపీ వంశీ అనుచరులు వైరల్ చేస్తున్నారు. ఆదివారం సాయత్రం మంత్రి సీతక్క వెంట వచ్చిన వంశీ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వంశీ వ్యాఖ్యల కలకలం…
అయితే త్రివేణి సంగమంలో పుణ్య స్నానానికి ముందు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ వృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సరస్వతి అంతర్వాహిని పుష్కరాల్లో తనకు ఆహ్వానం అందలేదని చెప్పకనే చెప్పిన వంశీ కృష్ణ తమ హక్కుల సంఘాల కోసం పోరాడిన దళిత సంఘాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా తాను ముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నానని డబ్బు కంటే చాలా ముఖ్యమైనది కులమేనన్నారు. కులం బట్టి ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఈ రోజుల్లో తెలుస్తోందని, రాజ్యంగంలోని ఆర్టికల్స్ ప్రకారం సమాన హక్కులు ఉంటాయని, అంటరానితనం ఉండకూడదని స్ఫష్టం చేశాయని వ్యాఖ్యానించారు.