Kaleshwaram: గోదావరి పుష్కరాల కోసం సన్నాహాలు…

కాళేశ్వరంలో భూసేకరణ కోసం ఏర్పాట్లు…

దిశ దశ, కాళేశ్వరం:

గోదావరి పుష్కరాల కోసం దేవాదాయ శాఖ ఇప్పటి నుండే దృష్టి సారించింది. 2027లో జరగనున్న ఈ పుష్కరాల నేపథ్యంలో గోదావరి నది తీరంలో భక్తులకు సౌకర్యాలు మెరుగు పర్చాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో నిర్మాణాలు జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గోదావరి పుష్కరాల నాటికి కాళేశ్వరంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన దేవాదాయ శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నది తీరంలో పుష్కర ఘాట్లు, కాళేశ్వరంలో రోడ్ల నిర్మాణం కోసం భూ సేకరణ జరిపేందుకు అధికారులు సర్వే చేశారు. ఈ మేరకు 17 సర్వే నంబర్లలోని 14.36 ఎకరాల భూమిని సేకరించాలని కాళేశ్వరం ఆలయ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. భూ సేకరణ కోసం సరస్వతి పుష్కరాల కోసం కెటాయించిన రూ. 5 కోట్ల అదనపు నిధుల నుండి రూ. ఒక కోటి 57 వేల 500లు వెచ్చించాలని నిర్ణయించారు. ఈ మేరకు భూసేకరణ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశాలు జారీ చేశారు.