Kaleshwaram, medigadda: అనుభవం లేని ఇంజనీర్లు… ఎంబీ రికార్డుల్లో దిద్దుబాట్లు…

విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు…

దిశ దశ, కాళేశ్వరం:

లక్ష్యాన్ని అందుకునేందుకు పకడ్భందీ ప్రణాళికలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. భవిష్యత్ తరాలకు సేవలందించాల్సిన నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. ప్రవాహానికి అడ్డుకట్ట వేసి నిర్మించే బ్యారేజీల విషయంలో అయితే మరింత లోతుగా పరిశోధనలు జరపాల్సి ఉంటుంది. కానీ కాళేశ్వరం విషయంలో రికార్డుల మోత మోగించే విషయంపై దృష్టి పెట్టిన సాంకేతిక నిపుణులు వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలం అయ్యారా..? జీవనది అయిన గోదావరి మీదుగా నిర్మిస్తున్న బ్యారేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయ్యారా అన్న విషయాలపై చర్చ మొదలైంది. తాజాగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక బయటకు రావడంతో కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నీటి పారుదల I&CAD విభాగం పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి.

కొత్త ఇంజనీర్లు…

తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగు నీరందించడంతో పాటు పలు ప్రాంతాలకు తాగు నీటిని సమకూర్చేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పునాదివంటిది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ. ఈ బ్యారేజీకి లక్ష్మీ కటాక్షం కంటే దరిద్రమే వెంటాడినట్టుగా కనిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలంపై ఒకటికి రెండు సార్లు నిపుణులతో చర్చలు జరిపి భవిష్యత్తులో ఆటంకాలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఇంజనీర్ల విషయంలో అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించిందని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక తేల్చింది. అనుభవం గడించిన ఇంజనీర్లు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నందున క్షేత్ర స్థాయిలో పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (AEE)ను మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కోసం వినియోగించవచ్చా లేదా..? వారిలో నైపుణ్యత ఎంతమేర ఉంది అన్న విషయాలను పట్టించుకోనట్టుగా అర్థమవుతోంది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదికను బట్టి అయితే కొత్తగా నియమాకం అయిన (AEE)లకు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ బాధ్యతలు అప్పగించారని, వీరి అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టుగా కనిపించిందని కూడా తేల్చింది. మేజర్ మెంట్ బుక్స్ (MB)లలో రికార్డులు నమోదు చేసిన విషయాలను గమనించినప్పుడు ఈ లోపం స్పష్టంగా కనిపించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. MBలలో ఓవర్ రైటింగ్, దిద్దుబాట్లు చాలా చోట్ల కనిపించాయని, ఇది ఏఈఈల అనుభవరాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని అభిప్రాయపడింది. ఎంబీ రికార్డుల్లో దిద్దుబాట్లను గమనించిన విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బ్యారేజీ నిర్మాణం కోసం నియమించిన ఇంజనీర్ల విషయంలోనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టయితే బావుండేదని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందని కూడా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక సూచించింది.

L&Tకి విషయంలో…

ఇకపోతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ విషయంలో L&T సంస్థకు ఉన్న అనుభావాల విషయంలోనూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాంట్రాక్ట్ ఏజెన్సీ సామర్థ్యాన్ని ధృవీకరించిన తరువాత పనులు అప్పగించాల్సి ఉంటుంది కానీ మేడిగడ్డ సెకెంట్ ఫైల్ కటాఫ్ లను నిర్మించే విషయంలో L&T సంస్థ అనుభవాన్ని దృవీకరించడంలో సదరు విభాగం విఫలం అయిందని కూడా నివేదిక స్పష్టం చేసింది. సెకెంట్ ఫైల్ కటాఫ్ లకు IS కోడ్ లేదని, Z-టైప్ షీట్ పైల్స్ లేదా RCC డయాఫ్రమ్‌లకు బదులుగా వినియోగించి కొత్త విధానాన్ని అమలు చేశారని తేల్చింది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (CDO) కూడా నిర్మాణం విషయంలో భాగస్వామం కాలేదని, దీంతో ఫీల్డ్ లో ఉన్న అధికారులు ఆమోదించిన క్వాలిటీ కంట్రోల్ ప్రణాళిక లేకుండా కాంట్రాక్ట్ కంపెనీ విధానాన్నే అనుసరించాల్సి వచ్చిందని కూడా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం లేదా నిర్మాణ పద్దతులను అమలు చేసేముందు శాఖాపరంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సెకెంట్ పైల్ ఎగ్జిక్యూషన్‌లో లోపాల కారణంగా, తెప్ప కింద కావిటీస్ ఏర్పడటం ద్వారా మేడిగడ్డ 7వ బ్లాకులో నిర్మాణ వైఫల్యానికి కారణమైందని, ఈ కారణంగానే పిల్లర్ కుంగుబాటుకు గురైందని కూడా వెల్లడించింది.

రిటైర్డ్ అధికారులపైనా…

అయితే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాల విషయంలో ఇంజనీరింగ్ అధికారుల తప్పిదాలను ఎత్తి చూపిన విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికల రిటైర్ అయిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. పదవీ విరమణ చేసిన అధికారులపై చర్య తీసుకోవడానికి వీలుగా తెలంగాణ సవరించిన పెన్షన్ నియమాలు, 1980లోని నిబంధన 54ని అమలు చేయవచ్చని కూడా విజిలెన్స్ రిపోర్టు సూచించడం గమనార్హం. వీరితో పాటు ఇంకా డ్యూటీలో కొనసాగుతున్న అధికారులపై 1992లోని నిబంధన 20 కింద 33 మంది అధికారులపై ప్రధాన క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని కూడా తేల్చిచెప్పింది. బ్యారేజీకి సంబంధించిన ఆర్థికపరమైన అనుమతుల విషయంలో ఆర్థిక శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై కూడా క్రమ శిక్షణా చర్యలు తీసుకోవచ్చని కూడా సూచించడం గమనార్హం. డిస్ట్రిక్ట్ వర్క్స్ అకౌంట్స్ (DWA), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ లపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవల్సి ఉంటుందని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ రిపోర్టు స్పష్టం చేసింది.

వారి వివరాలివే…

రిటైర్ అయిన అధికారులపై జరిమాన విధించాలని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం సూచించింది. పెన్షన్ రూల్స్ సవరణ చట్టం ప్రకారం అమలు చేయాలని కోరింది ఈ జాబితాలో ఇంజనీర్-ఇన్-చీఫ్ (జనరల్) (రిటైర్డ్), ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ చీటీ మురళీధర్, ఇంజనీర్-ఇన్-చీఫ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్.వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించిన గజ్జెల హరిహరచారి, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బి వెంకటేశ్వర్లు, ఎస్ఈగా పనిచేసిన చాట్ల గంగాధర్, చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన వి అజయ్ కుమార్, ఏ నరేందర్ రెడ్డిలపై జరిమానా విధించాలని సిఫార్సు చేసింది.

విధుల్లో ఉంటూ…

నేటికీ విధుల్లో కొనసాగుతున్న వారిలో మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి కారణమైన అధికారులు కూడా ఉన్నారని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం… ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఆపరేషన్స్, అండ్ మెయింటెనెన్స్) భూపతిరాజు నాగేంద్రరావు, చీఫ్ ఇంజనీర్ తొడుపునూరి శ్రీనివాస్, డైరక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ వి ఫణిభూషన్ శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మొహమ్మద్ అజ్మల్ ఖాన్, చీఫ్ ఇంజనీర్ కొట్టె సుధాకర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటిండెంట్ ఇంజనీర్ సూదగని సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బి వెంకట రమణా రెడ్డి, సర్దార్ ఓంకార్ సింగ్, ప్రస్తుతం ఈఈ పని చేస్తున్న సిహెచ్ తిరుపతి రావు, డీఈఈ బానోతు నంద, అజ్మీరా సురేష్ కుమార్, ఎల్ భీమరాజు, ఏఈఈ వలి షేక్, బోగే శ్రీనివాస్, అంకిలియా రవికాంత్, ఆర్ విజయ్, జి గంగాధర్, జి సాయిచరణ్, ఎం ప్రసాద్, ప్రస్తుతం డీఈఈగా పని చేస్తున్న మేరుగు రాజు, ఏఈఈ బి గణేష్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎం ఇస్మాయిల్ సాజిద్, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ పి ఎ వెంకట కృష్ణ, ఎస్ఈ కె దేవేందర్ రెడ్డి, ఈఈ ఎం రఘురామ్, క్వాలిటీ కంట్రోల్ డీఈఈ బి కిరణ్ కుమార్, ఈఎన్సీ అడ్మిన్ ఏఈఈ ఎ కృష్ణమోహన్, ఈఈ జి కృష్ణారెడ్డి, ఏఈఈ ఈ సుకుమార్, పి శ్రవణ్ కుమార్, ఎస్ఈ కెఎస్ఎస్ చంద్రశేఖర్, హెచ్ బస్వరాజ్, ఈఈ తౌటం హేమలతలపై జరిమానా విధించాలని విజిలెన్స్ ఎన్ పోర్స్ మెంట్ నివేదిక సూచించింది.

సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్…

విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ సీసీఏ రూల్స్ తో పాటు సుప్రీం కోర్టు తీర్పులను కూడా తన నివేదికలో ఊటంకించింది. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు కానీ, కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవచ్చని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక స్పష్టం చేసింది.

You cannot copy content of this page