కోర్టు కేసులు పెడుతామని హెచ్చరికలు…
సంకటస్థితిలో సామాన్యులు…
దిశ దశ, జగిత్యాల:
రుణం తీసుకునే వరకూ ఇస్తామంటూ వెంటపడతారు… రికవరీ చేసుకోవడం చేత కాత సామాన్యులను ఇబ్బందులు పెడుతారు… ఇది ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల తీరు. దేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులను సామాన్యులు ఎదుర్కొంటున్నారు. కానీ ఫిర్యాదు చేసేందుకు మాత్రం ముందుకు ఎవరూ రావడం లేదు. తాజాగా జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లికికి చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధితులు తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.
సంబంధం లేకున్నా…
అయితే రుణం తీసుకున్న వారితో కానీ, వారికి రుణం ఇచ్చేప్పుడు కూడా తమకేమీ సంబంధం లేకున్నాప్పటికీ బజాజ్ ఫైనాన్స, క్రెడ్బీ కంపెనీల ప్రతినిధులు నిత్యం ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. తాము ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోకున్నా తమను వేధింపులకు గురి చేస్తున్నారని, తమకు సంబంధం లేని వ్యక్తులకు రుణం ఇచ్చి తమను బాధ్యులను చేస్తున్నారని కూడా వాపొయారు. అసభ్యపదజాలాన్ని ప్రయోగిస్తూ ఇష్టారీతిన దుర్భాషలాడుతున్నారని ఇందుకు సంబంధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాటిపల్లి వాసులు అధికారులను వేడుకున్నారు.
ఎందుకిలా… ?
ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు రుణాలు ఇవ్వడం వాటిని రికవరీ చేసుకునేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం రివాజుగా మారింది. ముందుగా రుణం ఇస్తామని ఎరవేసి రికవరీ కోసం చట్టవ్యతిరేకంగా రికవరీ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కొంతమంది ఏజెంట్లు అయితో ఇండ్లలోకి చొరబడి మరీ లోన్ డబ్బులు చెల్లించాలని వార్నింగులు కూడా ఇస్తున్నారు. ఇవేవి చాలవన్నట్టుగా లోన్ తీసుకున్న వ్యవహారంతో సంబంధం లేని వారిని హింసిస్తున్న తీరు సంచలనంగా మారింది. రుణాల రికవరీ కోసం ప్రైవేటు ఫైనాన్స్ వాలాలు ఏకంగా కాలా డాటా సేకరిస్తున్న తీరు ఆందోళనకరం. ఫ్రైవేటు ఫైనాన్స్ కంపెనీల నుండి రుణం తీసుకున్న వారి మొబైల్ కాంటాక్ట్ నంబర్లు, ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ డాటా కూడా సేకరిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. కాల్ డాటా సేకరించి రుణ గ్రహితీలతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడిన వారిని వదిలిపెట్టకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా లీగల్ నోటీసుల పేరిట వాట్సప్ మెసెజులు పెడుతున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తితో పరిచయం ఉన్న పాపానికో ఎప్పుడో తమతో ఆ కాంటాక్టు నంబర్ నుండి మాట్లాడినందుకో రికవరీ కోసం ఫైనాన్స్ కంపెనీలు దుస్సాహాసానికి ఒడిగడుతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూ రుణాల రి్కవరీ కోసం చేస్తున్న తప్పిదాలు అన్నీ కావు.
చట్టబద్దమేనా..?
రుణాలు తీసుకున్నదెవరూ..? ష్యూరిటీ ఇచ్చింది ఎవరూ…? రికవరీ కోసం వేధింపులకు గురి చేస్తున్నదెవరిని అన్న విషయంపైనే రిజర్వూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రుణం ఇచ్చేప్పుడు వెనకాముందు ఆలోచించకుండా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు సంబంధం లేని వ్యక్తులను మానసిక క్షోభకు గురి చేస్తున్న విషయంపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. అంతేకాకుండా రుణాల రికవరీ కోసం ఫైనాన్స కంపెనీలు న్యాయస్ధానాలను ఆశ్రయించకుండా రికవరీ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తున్న చర్యలపై కూడా చట్టాలకు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. మరో వైపున కాల్ డాటా ఎలా సేకరిస్తున్నారోనన్న విషయాన్ని అత్యంత సీరియస్ గా పరిగణించినట్టయితే తప్ప ప్రైవేట్ ఫైనాన్సుల ఆగడాలను కట్టడి చేసే పరిస్థితి లేదు.