అన్నసత్రం నిర్వాహాకుల వినూత్న నిరసన
దిశ దశ, కాళేశ్వరం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరస్వతి నది పుష్కరాల్లో సామాన్యుల కష్టాలను పట్టించుకున్న వారు మాత్రం లేరు. ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాన్ని పోలీసుల చక్రబంధంలో చుట్టేశారన్నట్టుగా వ్యవహరించారు. 12 రోజుల పాటు నిర్వహించిన పుష్కరాల విషయంలో విలువలు కూడా లేకుండా పోయాయన్న ఆవేదన వ్యక్తం అయింది. ఖాకీల వలయం, వారి కనుసైగల్లోనే పుష్కరాలు నిర్వహించిన తీరు సరికాదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అన్న సత్రాలపైనా…
పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఉచిత భోజనం ఏర్పాటు చేయాలన్న తలంపుతో పలువురు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్స్ ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో భోజనాలు అందించారు. అంచనాలకు మించి వచ్చిన భక్తులకు వచ్చినా భోజనాలు ఎప్పటికప్పుడు సిద్దం చేసి భక్తుల ఆకలి తీర్చడంలో తమవంతు శ్రమ పడ్డారు వాసవి క్లబ్స్ ప్రతినిధులు. ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనాలు కూడా బావున్నాయని పోలీసులు కూడా రోజూ వచ్చి తినిపోయే వారు. అయితే అనూహ్యంగా వస్తున్న భక్తులకు సరిపడేంత భోజనాలు ఏర్పాటు చేయాలని భావించిన నిర్వహాకులు బియ్యంతో పాటు వంటకు అవసరమైన పప్పులు, ఉప్పులను కాళేశ్వరానికి తెప్పించుకున్నారు. అప్పటికే అక్కడకు తీసుకొచ్చిన సరుకులు అన్ని అయిపోతుండడంతో హుటాహుటిన ప్రత్యేక వాహనాల్లో తెప్పించారు. అయితే పోలీసులు మాత్రం ఈ వాహనాలను కాళేశ్వరంలోకి అనుమతించలేదు. దీంతో నిర్వహాకులు వెల్లి అసలు విషయం చెప్పినా ససేమిరా అన్నారు. చేసేదేమి లేక నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకులు కొనుగోలు చేసి భక్తులకు భోజనాలు అందించారు. ఉచిత భోజనానికి సంబంధించిన విషయంలోనూ కనికరించని పోలీసుల తీరుపై నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భోజనం చేసేందుకు తమ భోజనశాల వద్దకు వచ్చిన పోలీసులను నిర్దాక్షిణ్యంగా వెల్లగొట్టారు. భక్తుల కడుపునింపేందుకు తెప్పించిన సరుకుల వాహనాలను అనుమతించనప్పుడు మీకు ఎందుకు భోజనం పెట్టాలని ప్రశ్నించారు.
ఆలోచన ఉంటే…
అధికార యంత్రాంగం అంచనాలకు కూడా అందనంత స్థాయిలో కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన వాహనాల రద్దీ కారణంగా చాలా సార్లు ట్రాఫిక్ జాం అయిన సంగతి తెలిసిందే. ఇదే పరిస్థితి వాసవి క్లబ్ నిర్వహాకులకు కూడా ఎదురు కావడం వల్లే అప్పటికప్పుడు వంట సరకులు తెప్పించారు. ఈ వాహానాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు పోలీసులు. ముందే ఉచిత అన్న భోజనాలను ఏర్పాటు చేసిన నిర్వాహాకులతో మాట్లాడి వంట సామాన్లు తరలించుకునేందుకు అవసరమైన వాహనాలకు పాసులను ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి ఎధురయ్యేది కాదు. అడుగడుగుకో పోలీసు అన్నట్టు ప్రధాన రహదారులపై నియమించినప్పటికీ ఆర్టీస్ బస్ స్టేషన్ నుండి వచ్చి పోయే భక్తులను క్రమశిక్షణలో పెట్టేందుకు మాత్రం చొరవ చూపలేదు. బస్సు వచ్చిందంటే చాలు సీట్ల కోసం తోసుకున్న సందర్బాలు చాలా జరిగాయి. అలాగే గోదావరి నదికి తరలి వెల్లేందుకు ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల విషయంలోనూ ఇదే పరిస్థితి తయారు కావడంతో భక్తులు పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇకపోతే ఉచిత బస్సులు దింపిన వద్ద నుండి నదీ తీరానికి చేరుకోవడానికి కిలోమీటర్ వరకు భక్తులు కాలినడకన వెళ్లాల్సిందే తప్ప మరో దారి లేకుండా పోయింది. దీంతో వృద్దులు, వికలాంగులు పడ్డ అవస్థలు అన్ని ఇన్నికావు. పుష్కర ఘాట్ వద్ద తమకు నచ్చిన వాహనాలను సమీపంలోకి పంపించేందుకు క్లియరెన్స్ ఇచ్చిన పోలీసులు వికలాంగులకు సంబంధించిన వాహనాలను కూడా అనుమతించకపోవడం విస్మయం కల్గిస్తోంది. కంట్రోల్ రూం నుండి చెప్పిస్తే వదులుతామని చెప్పి తప్పించుకోవడం కూడా డ్యూటీ ఆఫీసర్ల వంతు అయింది. అంటే కనీసం మానవత్వాన్ని ప్రదర్శించే అవకాశం కూడా కల్పించనంత కఠినంగా ఉండాలన్న ఆదేశాలు ఇవ్వడానికి కారణమేంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది.
వీఐపీల సేవలు…
ఇకపోతే ఆర్టీసీ బస్ స్టేషన్ కు ఇరువైపులా ఉన్న రహదారులను కేవలం వీఐపీల కోసం మాత్రమే కెటాయించారు. ఈ రెండు రహదారులను వీఐపీలు మాత్రమే వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ రెండు రోడ్ల మీదుగా కాలిబాటన తప్ప వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమానికి కానీ, ఆలయానికి కానీ చేరుకునే పరిస్థితి లేదు. ఈ రోడ్లలో వీఐపీల వాహనాలు మాత్రం కుయ్ కుయ్ మంటూ తిరగాలి తప్ప సామాన్యుల వాహనాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది.
కాన్వాయ్ లో ఎన్ని…
ఇకపోతే వీఐపీల కోసం ప్రత్యేకంగా అలాట్ చేసిన రహదారుల మీదుగా వీఐపీల రాకపోకలు సాగించినప్పుడు చేసిన హాడావుడి అంతా ఇంతా కాదు. నడుచుకుంటూ వెల్లే సామాన్య భక్తులను కూడా పక్కకు నిలబడాలని చాలా సార్లు హుకూం జారీ చేశారని భక్తులు ఆరోపించారు. వీఐపీ వస్తున్నారంటే చాలు భక్తులు అసహనం వ్యక్తం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. పైలెట్, ఎస్కార్ట్, వీఐపీ ప్రయాణించే వాహనాలతో పాటు ఇబ్బడిముబ్బడిగా వాహనాలను అనుమతించడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సామాన్యుల విషయంలో రద్దీ బూచి చూపించిన పోలీసు అధికారుల వీఐపీల వెంట తిరిగే వాహనాల విషయంలో ఎందుకు నియత్రించలేకపోయారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పదుల సంఖ్యలో వాహనాలు ఎందుకు అనుమతించారన్నది అధికారులకే తెలియాలి. సామాన్య భక్తులు మాత్రం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే ఘీంకరించే పోలీసులు వీఐపీల విషయంలో మాత్రం ఉదారత ఎందుకు అవలంభించారన్నదే అంతు చిక్కడం లేదు. ప్రముఖుల పేరిట ఇతరుల వాహనాలను అనుమతించడం సరైందేనా కాదా అన్నది ఆలోచించుకోవల్సిన అవసరం ఉంది.