కెవియెట్ పిటిషన్ వేసిన ఈఓ
నేనూ పిటిషన్ వేస్తా: ప్రతాప రామకృష్ణ
దిశ దశ, వేములవాడ:
తెలంగాణాకే తలమానికంగా నిలిచే వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ప్రణాళికలు లేకుండా, నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో అభివృద్ది విషయంలో స్ఫష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది. స్థానికుల ఉపాధి కోల్పోవడంతో పాటు ఈశాన్యం వైపున ఉన్న కోటి లింగాలను తొలగించడం వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సమితి ఇప్పటికే పట్టణం బంద్ పాటించింది. అయితే ఆలయ అభివృద్ది అంశంపై రెండు రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టణ ప్రముఖులతో సమావేశం నిర్వహించి అభిప్రాయలను తెలుసుకున్నారు. ఈ సమావేశం జరిగిన మరునాడు, బుధవారం సాయంత్రం ఆలయ పరిరక్షణ సమితి అధక్షుడు ప్రతాప రామకృష్ణకు హై కోర్టు నుండి కెవియట్ నోటీసులు అందాయి. ఈలయ ఈఓ కె వినోద్ ఈ మేరకు హై కోర్టును ఆశ్రయించి ఆలయ అభివృద్ది కోసం 2024 నవంబర్ 11న go.rt నంబర్ 588ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, పనులు కూడా పురోగతిలో ఉన్నాయని రాజన్న ఆలయంలో అభివృద్ది పనులను ఆపేందుకు స్టే కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే తమకు నోటీసు ఇచ్చిన తరువాత నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ మేరకు హై కోర్టు వేములవాడ ఆలయ పరిరక్షణ సమితి నేత ప్రతాప రాకకృష్ణకు నోటీసులు పంపించింది.
పనులు చేస్తున్నదెవరూ..?
కెవియట్ నోటీసులపై వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఛైర్మన్ ప్రతాప రాకకృష్ణ స్పందించారు. రెండు రోజుల క్రితం ఆలయ అభివృద్దిపై ప్రభుత్వ విప్ సమావేశం అయ్యామని మరునాడు ఆలయ ఈఓ హై కోర్టు ద్వారా కెవియట్ నోటీసులు పంపించడం ఏంటని ప్రశ్నించారు. అసలు వేములవాడ ఆలయ విస్తరణ పనులు వేములవాడ ఆలయ అభివృద్ది అథారటీ (VTDA) పర్యవేక్షిస్తోందా, ఆర్ అండ్ బి నిర్మాణాలు చేయిస్తోందా, ఆలయ ఈఓ ఆధ్వర్యంలో జరుగుతున్నాయా అన్నదే అర్థం కాకుండా పోయిందన్నారు. రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనుల నిర్వహాణపైనే స్పష్టత లేదని అలాంటప్పుడు ఈఓ కెవియట్ పిటిషన్ ఎలా వేశారో అర్థం కావడం లేదని ప్రతాప రామకృష్ణ అన్నారు. ఓ వైపునతో స్థానికంగా సమావేశాలు పెడుతూ మరో వైపున కోర్టులను ఆశ్రయించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాము కూడా కోర్టును ఆశ్రయించి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్దం కాలేదని వేలాది సంవత్సరాల క్రితం సిద్దులు ప్రతిష్టించిన విగ్రహాలను ముట్టుకోవడానికి ఏ అంధికారం ఉందని ప్రశ్నించారు. ప్రతి సారి కూడా శృంగేరి పీఠాధిపతి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని చెప్తున్నారని కానీ వీరు చేసిన ప్రతిపాదనలకు పీఠం ప్రతినిధులు సంతకాలు పెట్టారా అని అడిగారు. గత ప్రభుత్వం 35 ఎకరాలు తీసుకున్నదని దానిలో విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డును ఆక్రమించి ఆలయ విస్తరణ పనులు చేయాలని నిర్ణయించడం సరికాదని, ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాలు రోడ్లపై ఉన్నా తొలగిస్తుంటే వేములవాడలో ఆలయం కోసం రోడ్డును స్వాధీనం చేసుకుంటామని నిర్ణయించడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు పర్మిషన్ ఎక్కడో తీసుకున్నారో ఈఓ చెప్పాలన్నారు. ఇంతకాలం ఆధ్యాత్మిక కేంద్రం అయినందున తాము చూసీ చూడనట్టుగా వ్యవహరించామని ఇక ముందు అన్ని నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న విషయంపై నిలదీస్తామని పీఆర్కే స్పష్టం చేశారు. ఈ విషయంపై కోర్టులో ఛాలెంజ్ చేస్తామని, తామేదో సంఘ విద్రోహశక్తుల్లా అబివృద్దిని అడ్డుకుంటున్నామని ప్రచారం చేయడం సరికాదన్నారు.