విజిలెన్స్ దాడులతో గుట్టు రట్టు…
చీఫ్ ఇంజనీర్ అక్రమార్జన…
దిశ దశ, జాతీయం:
రూ. 2 వేల వేతనంతో ప్రభుత్వ శాఖలో చేరిన ఆయన ఇప్పుడు రూ. వంద కోట్లకు పైగా సంపాదించాడు. విజిలెన్స్ అధికారుల దాడులతో చీఫ్ ఇంజనీర్ బాగోతం బట్టబయలు అయింది. ఒడిషా పంచాయితీ రాజ్ శాఖలో 1990వ దశాబ్దంలో రూ. 2 వేల స్టైఫండరీ కన్సాలిడేట్ పేమెంట్ వేతనంతో విధుల్లో చేరాడు అంచలంచెలుగా ఎదిగి నేడు చీఫ్ ఇంజనీర్ స్థాయికి చేరుకున్నాడు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఒడిషా విజిలెన్స విభాగం శుక్రవారం దాడులు చేసి ఆస్తుల చిట్టాను రాబట్టింది. ఇంకా దాడులు చేయాల్సి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఒడిషా , భువనేశ్వర్లోని ఆర్డబ్ల్యు డిపార్ట్మెంట్, ప్లాన్ రోడ్స్ చీఫ్ ఇంజనీర్గా పని చేస్తున్న బైకుంఠ నాథ్ సారంగి ఇంటితో పాటు పలు చోట్ల విజిలెన్స్ బృందాలు సోదాలు చేపట్టాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏక కాలంలో ఏడు చోట్ల దాడులు చేసిన అధికారులు సారంగి అక్రమ ఆస్తుల గుట్టు తేలుస్తున్నారు.
విసిరేసి…
అయితే శుక్రవారం సారంగి ఇంటిపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వెళ్లగా వారిని గమనించి భువనేశ్వర్ లోని తన ఫ్లాట్ నుండి రూ. 500 నోట్ల కట్లలు రోడ్డుపైకి విసిరేశారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సోదాలు చేపట్టారు.
స్పెషల్ టీమ్స్…
చీఫ్ ఇంజనీర్ సారంగికి సంబంధించిన అక్రమ ఆస్తుల డాటా సేకరించిన విజిలెన్స్ అధికారులు ఏడు బృందాలుగా విడిపోయారు. 8 మంది డీఎస్పీలు, 12 మంది ఇన్స్ పెక్టర్లు, ఆరుగురు ఏఎస్ఐలతో పాటు విజిలెన్స్ విభాగానికి చెందిన సిబ్బంది బృందాలుగా విడిపోయి భువనేశ్వర్, అంగూల్ తో పాటు పలు చోట్ల ఏడు చోట్ల దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రూ. 2.51 కోట్ల నగదు, రెండు బహుళ అంతస్తుల భవనాలు, 9 ప్లాట్లు, రూ. 2.7 కోట్ల షేర్లలో పెట్టుబడులు, భీమా, బ్యాంక్ డిపాజిట్లు రూ. 1.5 కోట్లు, అంగూల్ లోని కరడగాడియాలో రెండంతుస్తుల భవనం, మాటియా సాహి వద్ద మరో రెండంతస్తుల భవన, భువనేశ్వర్ లోని దుందుమాలోని పీడీఎస్ ఎక్సోటికాలో 1530 SFT విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్, సియులాలో 1100 SFT విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్, అంగూల్ కరగగాడియాలో వేర్వేరు చోట్ల Ac.0.09 dcml , Ac.0.08 dcml విస్తీర్ణంలో ఉన్న భూమి, అంగుల్లోని మాలి సాహి వద్ద Ac.0.32 dcml, సియులా, పిపిలి పూరిలో వేర్వేరు చోట్ల Ac.0.03 dcml, Ac.0.28 dcml, Ac.0.05 dcml, Ac.0.545 dcml విస్తీర్ణంలో భూమి ఉన్నట్టుగా గుర్తించారు విజిలెన్స్ అధికారులు. అంగూల్ లోని ఓ బ్యాంకులో సారంగి భార్య పేరిట ఉన్న లాకర్ తెరవాల్సి ఉండగా మరిన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహించాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. చీఫ్ ఇంజనీర్ సారంగా రూ. వంద కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా ప్రాథమికంగా నిర్దారించిన ఒడిషా విజిలెన్స్ అధికారులు పూర్తి వివరాలను తెలియజేస్తామని ప్రకటించారు.