Telangana Acb: రిటైర్మెంట్ కానున్న డీటీఓ… ఏసీబీకి చిక్కిన వైనం…

దిశ దశ, జగిత్యాల:

మరి కొద్ది రోజుల్లో పదవి విరమణ పొందాల్సిన డీటీఓ  ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది. మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేందుకు లంచం అడిగి అడ్డంగా బుక్కయిపోయాడు ఆ ఆఫీసర్.

సెల్ ఫోన్ రిటర్న్… 

జగిత్యాల జిల్లా రవాణా శాఖాధికారి బానోతు భద్రూనాయక్ రూ. 22 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో అధికారులు బాధితుని నుండి లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేశారు. జిల్లాలోని కోరుట్లకు చెందిన శశిధర్ అనే వ్యక్తికి జేసీబీ ఉండగా మోటార్ వెహికిల్ యాక్టు రూల్స్ ప్రకారం దానిని డీటీఓ సీజ్ చేశారు. జేసీబీతో పాటు ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడంతో కేసు నమోదు చేయవద్దని, జరిమానా విధించవద్దని, మొబైల్ తిరిగి ఇవ్వాలని శశిధర్ ప్రాధేయపడ్డాడు. రూ. 40 వేలు లంచంగా ఇస్తేనే కేసు బుక్ చేయనని, మొబైల్ ఫోన్ తిరిగి ఇస్తానని చెప్పడంతో  చివరకు  డీటీఓ రూ. 35 వేలకు డీల్ కుదిరింది. రూ. 13వేలు ఈ నెల 4న ఇచ్చిన బాధితుడు మిగతా రూ. 22 వేలు ఇఛ్చే ముందు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ అరవింద్ ద్వారా లంచం తీసుకుంటుండగా భద్రూనాయక్ ను పట్టుకున్నామని, వీరిని కరీంనగర్ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

గతంలోనూ…

మోటారు వెహికిల్ ఇన్స్ పెక్టర్ గా పని చేసినప్పుడు కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ తో పాటు మహబూబాబాద్ లో పని చేసినప్పుడు భద్రూనాయక్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పలుమార్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన చివరకు రిటైర్ అయ్యే సమయంలో కూడా లంచం తీసుకోవడం గమనార్హం. ఈ నెలాఖరును రిటైర్ కావల్సి ఉందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా భద్రూనాయక్ లంచం తీసుకోవడం అందరినీ విస్మయ పరిచింది. రిటైర్ అయ్యే ముందు ఏసీబీ ట్రాప్ కావడంతో ఆయనకు రావల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆగిపోనున్నాయి. ఏసీబీ అధికారులు పాత రికార్డులను తిరగదోడితే భద్రూనాయక్ చరిత్ర అంతా కూడా వెలుగులోకి వస్తుంది.