Acb Telangana: తెల్లాపూర్ లో విల్లా… రూ. 200 కోట్ల ఆస్తి…

కొనసాగుతున్న విచారణ…

ఇంజనీర్ శ్రీధర్ అక్రమ ఆస్తులు

దిశ దశ, హైదరాబాద్:

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన నూనె శ్రీధర్ అక్రమ ఆస్తుల గుట్టు వెలికి తీస్తున్నారు ఏసీబీ అధికారులు. బుధవారం వేకువజాము నుండి తెలంగాణాలోని 13 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కీలక డాక్యూమెంట్లు, ఆభరణాలు, వాహనాలను గుర్తించారు. బుధవారం రాత్రి ఈఈ శ్రీధర్ ను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన ఏసీబీ అధికారులు విచారణ ఇంకా కొనసాగిస్తున్నామని ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు గుర్తించిన రికార్డుల ప్రకారం ఈఈ శ్రీధర్ కు సంబంధించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

తెల్లాపూర్ లో విల్లా…

హైదరాబాద్ నగరంలో విలసవంతమైన జీవనం గడిపే ప్రాంతాల్లో ఒకటైన తెల్లపూర్ లో ఓ విల్లా, షేక్ పేటలో ఫాట్, కరీంనగర్ లో మూడు ఫాట్లు, అమీర్ పేటలో కమర్షియల్ బంగ్లా, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో మూడు ఇండిపెండెంట్ భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో 19 ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

200 కోట్లపైనే…

ఇప్పటి వరకు నూనె శ్రీధర్ కు సంబంధించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 200 కోట్ల పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరైన నూనె శ్రీధర్ ప్రస్తుతం ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తుండడం గమనార్హం.

థాయిలాండ్ లో పెళ్లి…

ఇకపోతే నూనె శ్రీధర్ తన కొడుకు పెండ్లి ఏకంగా థాయిలాండ్ దేశంలో చేశాడని కూడా ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. కోట్లాది ఖర్చు చేసి థాయిలో వివాహం జరిపించాడని తెలుస్తోంది. మరో వైపున ఇంకా శ్రీధర్ కొన్ని ప్రేవేటు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అధికారుల వద్ద సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీధర్ కుటుంబ సభ్యులతో పాటు బినామీలు కూడా ఉన్నారా అన్నా కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారణ జరిపించనున్నట్టుగా సమాచారం. దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో శ్రీధర్ కు సంబందించిన సమగ్రంగా సేకరించిన తరువాత దాడులు జరిపినట్టుగా స్పష్టం అవుతోంది.

అక్కడ కూడా..?

నూనె శ్రీధర్ పని చేసిన చోట్లలో కూడా ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం అండర్ టన్నెల్ ఇరిగేషన్ క్యాంపులో సోదాలు జరిపారు.

మళ్లీ స్టార్ట్…

తెలంగాణ ఏసీబీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇంజీనీర్లే లక్ష్యంగా దాడులు జరుపుతుండడం సంచలనంగా మారింది. తాజాగా ఈఈ శ్రీధర్ ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేయడంతో ఏసీబీ వద్ద ఇంకా ఎంతమంది చిట్టా ఉందోనన్న కలవరం మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లకు సంబంధించిన ఆస్తుల డాటా మొత్తం ఏసీబీ అధికారుల వద్ద ఉండి ఉంటుందని ఇరిగేషన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరోనని, ఏసీబీ ఎవరిని కటకటాల వెనక్కి పంపిస్తుందోనన్న ఉత్కంఠత ఇరిగేషన్ ఇంజీనర్లలో నెలకొన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page