Telangana crime: పల్స్ చూడలేని డాక్టర్… ఫైల్స్ క్లియర్ చేయలేని ఐఏఎస్…

తెలంగాణాలో లేడీ కిలాడి…

బాధితుని ఫిర్యాదుతో వెలుగులోకి…

దిశ దశ, నల్గొండ:

నోటికి వచ్చిన అబద్దం చెప్పేసి దండుకునేంత దండుకుని పరార్ అయితే సరిపోదా… కష్టం చేయకుండా చేతినిండా డబ్బు ఉంటే చాలు కదా అనుకుని ఓ గ్రాడ్యూయేట్ లేడీ నేర ప్రవృత్తికి అలవాటు పడిపోయింది. అమాయక యువకులకు వలపు వల, పోలీసులకు టోకరా ఇచ్చేందుకు అబద్దాలు ఆడుతూ అందరినీ నిండా ముంచేస్తోంది. చివరకు ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో లేడి క్రిమినల్ వ్యవహారం బట్టబయలు అయింది. నల్గొండ జిల్లా పోలీసులు రంగంలోకి దిగడంతో కిలాడి చేసిన నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

బ్లాక్ మెయిలింగ్…

బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న సదరు యువతి చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాది క్రితం ఓ డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసి రూ. 5 లక్షలు వసూలు చేసింది. విద్యార్థినని చెప్పి ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ అక్కడివారితో స్నేహం చేస్తూ మొబైల్ ఫోన్లు చోరీ చేయడం వంటి నేరాలకు కూడా పాల్పడింది. కొన్ని చోట్ల అద్దె ఇంట్లో ఉంటూ అక్కడి వారితో సాన్నిహిత్యంగా మెదిలి ఛీట్ చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి.

వెలుగులోకి ఇలా…

ఓ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసిన సరిత డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని హెచ్చరించింది. బాధితుడు డయల్ 100కు కాల్ చేయడంతో నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష అని గుర్తించిన ఆమె గురించి ఆరా తీస్తున్న పోలీసులే ఆశ్యర్యపోయారంటే కిలాడి లేడి ఏ స్థాయిలో నేరాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు.

కేసులే కేసులు…

మలక్ పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూటౌన్, మిర్యాలగూడ వన్ పరిధిలలో సరిత అలియాస్ ప్రత్యూషపై పలు క్రిమినల్ కేసులు నమోదు అయినట్టు పోలీసుల విచారణలో తేలింది. మూడు రోజుల క్రితం డయల్ 100కు కాల్ చేసిన నిందితురాలు వనస్థలిపురం పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి తాను డీఎస్పీ భార్యనని చెప్పి పోలీసులకే దమ్కీ ఇచ్చింది. అంతకు ముందు ఓ యువతి మర్డర్ అయ్యిందంటూ హైదరాబాద్ లోని ఓ ఏసీపీకి, మిర్యాలగూడ ప్రాంతంలోని ఓ సిఐకి కాల్ చేసి మొబైల్ స్విచ్ఛాఫ్ చేసింది.

ఐఏఎస్, డాక్టర్…

ఇకపోతే ట్రాప్ చేసేందుకు ఓ చోట ట్రైనీ ఐఏఎస్ అధికారినని, మరోచోట రేడియోలాజిస్ట్ డాక్టర్ నని చెప్పి మోసాలకు పాల్పడినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. అమాయకులను బోల్తా కొట్టించేందుకు ఎప్పటికప్పుడు అబద్దాలు చెప్తూ వారి నుండి డబ్బులు వసూలు చేయడం, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశారంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకుంది సరిత అలియాస్ ప్రత్యూష. కొన్ని సందర్భాల్లో తాను డీఎస్పీ భార్యనని, మరికొన్ని సందర్భాల్లో డీఎస్పీ కూతురునని కూడా చెప్పుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఛీటింగ్ చేసి ఈజీ మనీ సంపాదించడం కోసం సరిత అలియాస్ ప్రత్యూషను నల్గొండ వన్ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

You cannot copy content of this page