దిశ దశ, కరీంనగర్:
మునిసిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు వెళ్లడించారు.

డబ్బులు పంచుతూ…
కరీంనగర్ కిసాన్ నగర్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అంబేడ్కర్ నగర్ కు చెందిన కుర్ర తిరుపతి(45) వద్ద రూ. 45,500 నగదు దొరికింది. దీంతో కుర్ర తిరుపతిపై Cr. No. 52/2026, USec. 173, 223 BNS Act, r/w 171-H P.R. Act కేసు నమోదు చేశారు. కిసాన్ నగర్ కు చెందిన లోకిని జంపయ్య (35) వద్ద రూ. 45,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న తరువాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జోక్యం చేసుకుని పోలీసుల విధులకు ఆటంకం కల్గించి వారి అదుపులో ఉన్న జంపయ్యను అనధికారికంగా విడిపించుకుని వెళ్లారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా ధర్నా చేపట్టారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కుర్ర తిరుపతి, ఎడ్ల అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, పెరుక మంజుల. బెజుగం మధులపై మరో కేసు నమోదు చేశారు. వీరిపై Cr. No. 52/2026, USec. 173, 223 BNS Act, r/w 171-H P.R. Act ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే ఘటన జరిగిన అనంతరం అదే ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరి ఎన్నికల నియమవాళిని అతిక్రమించారు. దీంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతిలపై Cr. No. 54/2026, u/sec. 223 r/w 3(5) BNS Act ప్రకారం కేసు నమోదు చేశామని త్రీటౌన్ సీఐ గుర్రం తిరుమల్ వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీఐ వివరించారు.
సీపీ వార్నింగ్…
ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు.

