కరీంనగర్ కోర్టుకు బాంబ్ బెదిరింపు… రంగంలోకి దిగిన పోలీసులు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామంటూ అగంతకుడు మెయిల్ చేశాడు. 12 ఆర్టీఎక్స్ బాంబులు పెట్టామని బుధవారం మద్యాహ్నం 12.05 నిమిషాలకు అవి పేలుతాయంటూ కోర్టుకు మెయిల్ రావడంతో కోర్టు అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కరీంనగర్ టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. కోర్టు భవనం అంతా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాంబులు ఏమీ లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా కోర్టులోని ప్రతి భవనంతో పాటు కోర్టు ఆవరణలో భారీగా తనిఖీలు చేపట్టారు.

సైబర్ క్రైం… 

జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు చేస్తూ మెయిల్ వచ్చిన విషయంపై కూడా పోలీసులు సమగ్రంగా ఆరా తీస్తున్నారు. మెయిల్ అడ్రస్ సేకరించిన సైబర్ క్రైం టీమ్ క్షుణ్ణంగా ఆరా తీసే పనిలో నిమగ్నం అయింది. మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది ఐపీ అడ్రస్ తదితర సమగ్ర వివరాలను ఎనాలిసిస్ చేసి అగంతకుని జాడ పట్టుకునే పనిలో సైబర్ క్రైం నిమగ్నం అయింది. మెయిల్ చేసిన వారి వివరాలను సేకరించి వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్టయితే అసలు విషయం తెలియనుంది.