దిశ దశ, ఆదిలాబాద్:
అవినీతికి పాల్పడతున్న ఉద్యోగులను పట్టుకుంటున్న ఏసీబీ తన పని తాను చేసుకుంటూపోతోంది. అయితే ఏసీబీ నమోదు చేస్తున్న ట్రాప్ కేసులపై సంబంధిత విభాగాల అధికారులు దృష్టి సారించడం లేదని స్పష్టం అవుతోంది.
బినామీ ఉద్యోగులు…
ల్యాండ్ సర్వే విభాగంలో ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు పట్టుకున్న కేసులపై దృష్టి సారించినట్టయితే మరో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సర్వే విబాగం ఉద్యోగుల్లో రెండు వైవిద్యమైన కేసులు బయటపడ్డాయి. ఈ అంశంపై సర్వే వింగ్ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్న వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడానికే పరిమితం అవుతున్న ఉన్నతాధికారులు మరో కోణంపై కూడా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సర్వే విభాగంలో బినామీ ఉద్యోగుల తంతు కూడా కొనసాగుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. నిర్మల్ జిల్లా మామడ మండలానికి చెందిన భూమికి సంబంధించిన సేత్వార్ నకలు జారీ చేసేందుకు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ జగదీష్ ను అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు 2024 నవంబర్ 29న జరిగిన ఈ కేసులో ఎస్ ప్రశాంత్ అనే వ్యక్తి ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. అయితే ప్రశాంత్ అనే వ్యక్తి భార్య అధికారికంగా అటెండర్ గా విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఆమె స్థానంలో ప్రశాంత్ పని చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. అలాగే 2025 జూన్ 4న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ మంజులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. తన భూమికి సంబంధించి సర్వే చేయాల్సి ఉన్నదని బాధితుడు మంజులను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డులతో పాటు ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిపిన ఆదారాలను బేస్ చేసుకున్న ఏసీబీ అధికారులు మంజులపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కూడా చైన్ మెన్ గా వ్యవహరిస్తున్న ఉదయ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతని తండ్రి ఉద్యోగం అయితే ఉదయ్ విధులకు హాజరవుతున్నాడని, ఈయన ద్వారానే భూమి సర్వేకు సంబంధించిన అవినీతి నగదు లావాదేవీలు జరిపినట్టుగా ఏసీబీ అధికారులు తేల్చారు. దీంతో వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కరీంనగర్ స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. అయితే రెండు చోట్ల కూడా ఉద్యోగం చేసేది ఒకరైతు వారి స్థానంలో మరోకరు విధులకు హాజరవుతుండడం గమనార్హం. బినామీ ఉద్యోగులను అనుమతించడానికి కారణం ఏంటీ..? ఇందుకు సంబంధిత అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిబంధనలకు విరుద్దం కాదా అన్న విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ సర్వే డిపార్ట్ మెంట్ విభాగంలో బినామీ ఉద్యోగులను అనుమతిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ సర్వే విభాగంలో బినామీ ఉద్యోగులను కొనసాగిస్తున్న విధానం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏసీబీ చేసిన దాడుల్లోనే రెండు చోట్ల బినామీ ఉద్యోగుల వ్యవహారం వెలుగులోకి వస్తే శాఖాపరంగా విచారణ చేస్తే మరిన్ని చోట్ల కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.