ప్రధాన పార్టీల ప్రత్యర్థులు ముగ్గురూ వారసులే…

కోరుట్ల ఎన్నికల ముఖచిత్రం

దిశ దశ, జగిత్యాల:

చైతన్య స్పూర్తిని కనబర్చే ఆ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఓ వైవిద్యత నెలకొంది. ముగ్గురు కూడా వారసత్వ రాజకీయాలకు వేదిక కావడమే ఈసారి స్పెషాలిటీ. ఈ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనుకుంటున్న వీరెవరంటే..?

బీఆర్ఎస్ అభ్యర్థి…

కోరుట్ల నియోజకవర్గంలో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సంజయ్ తనతండ్రి విద్యాసాగర్ రావు రాజకీయాల నుండి తప్పుకోవడంతో బరిలో నిలిచారు. కొంతకాలంగా నియోజకవర్గ ప్రజలతో టచ్ లో ఉంటూ పర్సనల్ ఇమేజ్ పెంచుకుంటూ వచ్చిన సంజయ్ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఆయనను సేఫ్ చేశారని కూడా పేరుంది. తొలిసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన డాక్టర్ సంజయ్ తొలి ప్రయత్నంలోనే చట్టసభలోకి అడుగు పెట్టాలన్న ఉత్సుకతతో ముందుకు సాగుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి…

బుగ్గారం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు నర్సింగరావు మరోసారి కోరుట్ల బరిలో నిలుస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన నర్సింగరావు గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుండి పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పోటీ పడగా ఈ సారి మాత్రం తనయుడు డాక్టర్ సంజయ్ తో అమితుమీ తేల్చుకోవాలని చూస్తున్నారు.

బీజేపీ అరవింద్…

ఇకపోతే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తండ్రి సీనియర్ నేత డి శ్రీనివాస్. ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన విధాన సభ, పరిషత్తుతో పాటు రాజ్యసభలకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన వారసత్వాన్ని అందుకుని 2019 లోకసభ ఎన్నికల్లోనే నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. తొలి ప్రయత్నంలోనే సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై పోటీ చేసి సంచలన విజయం అందుకున్నారు. తాజాగా జరుతున్న ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోకసభ పరిధిలోనే ఉన్న కోరుట్ల నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

రాజకీయాల్లో…

ప్రత్యక్ష్య రాజకీయాల్లో తలపండిన కుటుంబాలకు చెందిన ముగ్గురు కూడా కోరుట్ల నుండి పోటీ చేస్తుండడం విశేషం. పాలిటిక్స్ లో ఎత్తులు పై ఎత్తులు వేయడంలో ఆరితేరిన ఫ్యామిలీస్ కు చెందిన ముగ్గురు కూడా కోరుట్ల ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారోనన్నదే తేలాల్సి ఉంది. ఏ అభ్యర్థి ఇక్కడి ఓటర్ల మనసులు గెల్చుకుని అసెంబ్లీలోకి అడుగుపెడ్తారోనన్నది తెలియాలంటే మాత్రం డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

2023 assembly electionsLatest NewsMP ARAVINDtelangana newsWar between successors... Korutla's style of election