నిన్న భద్రాద్రి పోలీసులు నేడు సుక్మా బలగాలు…

వరస ఎన్ కౌంటర్లతో కలకలం

ఉలిక్కిపడుతున్న దండకారణ్యం

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య అటవీ ప్రాంతాల్లో వరస ఎన్ కౌంటర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున తెలంగాణ, చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరగగా తాజాగా సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో మరో ఘటన చోటు చేసుకుంది. దీంతో గోదావరి, ఇంద్రావతి నది పరివాహాక ప్రాంతాల దండకారణ్య అటవీ ప్రాంతం ఉలిక్కి పడుతోంది. ఓ వైపున బూట్ల చప్పుళ్లు… మరో వైపున కాల్పుల మోతలతో ప్రశాంతంగా ఉన్న సరిహద్దు అడవుల్లో అలజడి మొదలైంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల సమీపంలోని దండకారణ్య అటవీ ప్రాంతమైన పుట్టపాడు సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో ఎల్ఓఎస్ కమాండ్ ఎర్రయ్య అలియాస్ రాజేష్, మిలీషియా కమాండర్ నందాలు చనిపోయారు. ఘటనా స్థలం నుండి పోలీసులు మందుగుండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారు జామున చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా దంతేష్‌పురం అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో గొల్లపల్లి ఎల్ఓఎస్ కమాండర్, మడ్కం ఎర్ర, దళ సభ్యురాలు పోడియం భీమేలు చనిపోయినట్టు సుక్మా జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు, నక్సల్స్ వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

chattisgharcrime newsCRIME TODAYdantewadaencounterLatest Newsmaoist newsSUKMAtelangana news