గొర్రెల యూనిట్ల లబ్దిదారుల గోస…

స్వస్థలాలకు తీసుకెళ్లండని వేడుకోలు…

దిశ దశ, మానకొండూరు:

గొర్రెల యూనిట్ల కొనుగోలు కోసం రాయలసీమలో తిరుగుతూ అవస్థలు పడుతున్నారు కరీంనగర్ జిల్లా యాదవులు. వారం పది రోజులుగా ఇళ్లు వదిలిపెట్టి తిరుగుతున్నామని, అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను తీసుకెళ్లేందుకు వ్యాన్లు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు వారు. బాదితులు చెప్తున్న వివరాల ప్రకారం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన 24 మంది లబ్దిదారులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు అధికారులతో కలిసి వెల్లారు. మొదట 5 యూనిట్ల గొర్రెలు దొరకడంతో ఐదుగురు స్వస్థలానికి చేరుకున్నారు. మిగతా యూనిట్ల కోసం అన్వేషించేందుకు కడప, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాల్లో తిరిగామని, అయితే మూడు రోజుల క్రితం గొర్రెలు లభ్యమయ్యాయని వారు వివరించారు. అయితే గొర్రెలను తరలించుకపోయేందుకు మాత్రం వ్యాన్లు అద్దెకు దొరకడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు. మూడు రోజులుగా వ్యాన్ల కోసం ఎదురు చూస్తున్నామని, గొర్రెలను ఎంపిక చేసుకోవడం ఓ ఎత్తైతే… ఇప్పుడు వ్యాన్లు అద్దెకు దొరకడం తమకు మరో సవాల్ గా మారిందంటున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఉన్న తమను, గొర్రెలను స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అభ్యర్థిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బనగానపల్లి నుండి యాదవులు తీసుకొచ్చేందుకు స్థానిక అధికారులు చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు.

cm kcrkarimnagar newsKCRLatest Newsmanakondurrasamairasamai balakishantelangana news