బాండ్ పేపర్ కు పిండ ప్రధానం…

లేఖ రాసిచ్చిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లాలో కలకలం

దిశ దశ, జగిత్యాల:

తమకు ఇచ్చిన హామీ మాటల్లో కాకుండా లిఖిత పూర్వకంగా రాసిచ్చి ఆచరణలో పెట్టకపోవడాన్ని నిరసిస్తూ అక్కడి ప్రజలు వినూత్న నిరసనలు తెలిపారు. తమకు రాసిచ్చిన బాండ్ పేపర్ కు ఏకండా పిండ ప్రదానం జరిపి తమ బాధను వెల్లగక్కారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. బాధిత గ్రామాల ప్రజలు చెప్తున్న వివరాల ప్రకారం…. మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామం మీదుగా ప్రవహిస్తున్న వాగుపై వంతెన నిర్మిస్తామని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హామీ ఇస్తూ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడిని అధికారపార్టీకి చెందిన వ్యక్తిని గెలిపించాలని కోరడంతో తాము ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం గెలిపించామని వివరించారు. అయితే ఎమ్మెల్యే మాత్రం మాట తప్పడాన్ని జీర్ణించుకోలేకపోయిన గ్రామస్థులు బాండ్ పేపర్ కు నాలుగేళ్లు ముగిసినందున పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లుగా విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల రాకపోకలు అంతరాయం ఏర్పడుతోందని కూడా గ్రామస్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులంతా కూడా కలిసి వాగు సమీపంలోకి చేరుకుని భారీ సైజులో తయారు చేయించిన బాండ్ పేపర్ ఫ్లెక్సీ ముందు నిరసన వ్యక్తం చేస్తూ పిండ ప్రధానం చేశారు. తమకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే చేతల్లో చూపించనట్టయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ను కరపత్రాలుగా తయారు చేసి నియోజకవర్గం అంతా పంపిణీ చేస్తామని ప్రకటించారు. కోనరావుపేట గ్రామాన్ని కలుపుతూ లింక్ రోడ్ల నిర్మాణం చేస్తామని కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చినా కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. దీంతో కొండికర్ల, కోనరావుపేట గ్రామాలకు సంబంధించిన గ్రామస్థులమంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో నిరసన తెలుపుతామని వెల్లడించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన హామీ పత్రానికి పిండ ప్రధానం చేయడం సంచలనంగా మారింది.

cm kcrJAGITHYAL NEWSkorutlaLatest Newstelangana newsThe villagers protested against the bond paper written by the MLA