మంత్రి కేటీఆర్ ఇలాకాలో ధిక్కార స్వరం

మండల సభను బహిష్కరించిన సర్పంచులు ఎంపీటీసీలు

దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:

రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ధిక్కార స్వరాన్ని వినిపించారు. తొలిసారిగా మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ది పనులకు డబ్బులు వెచ్చించి అప్పుల ఊబిలో కూరుకపోయిన తమకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ది పేరిట అవార్డుల పంట పండిస్తున్న అధికారులు తమను అప్పుల ఊబి నుండి బయట పడే విధంగా చొరవ చూపడం లేదంటూ సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల సభకు హాజరైన సర్పంచులు తాము మండల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు కూడా సంఘీభావం తెలిపి మండల మీటింగ్ ను బైకాడ్ చేశారు. దీంతో మండల సభ వాయిదా పడాల్సి వచ్చింది. గ్రామాల్లో నిర్మాణం జరిపినప్పటికీ నిధుల లేమితో బిల్లులు మంజూరు చేయలేదు. నాలుగున్నరేళ్లుగా గ్రామాల అభ్యున్నతి కోసం అప్పులు చేసి మరీ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినా చేతికి మాత్రం డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు మండల సర్పంచులు. పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ పదవి కాలం ముగుస్తున్నా బిల్లులు రాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను కూడా నిధుల కెటాయింపు విషయంలో వివక్ష జరుగుతోందని ఆవేదన చెందారు. నిధుల మంజూరు విషయంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగానే తాము మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కించామని ప్రజా ప్రతినిధులు వెల్లడించారు.

karimnagar newsktrLatest Newslocal bodiesMINISTER KTRRajanna Sirisilla districttelangana news