రాములోరి పెళ్లికి ఆ మంత్రి దూరం..?

తండ్రి అనారోగ్యమే కారణం..?

దిశ దశ, ఖమ్మం:

శ్రీరామ నవమి ఉత్సవాలు అంత్యంత వైభవంగా సాగే భద్రాద్రిలో ఈ సారి ఆ ఉమ్మడి జిల్లా మంత్రి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏటా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించే వారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ఇద్దరు కూడా శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొనేవారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు అందించడం, ముత్యాల తలంబ్రాలు అప్పగించే కార్యక్రమాలతో పాటు వివాహ వేడుకలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ మంత్రి అజయ్ ప్రత్యక్ష్యంగా హాజరయ్యే వారు. ఈ సందర్భంగా ఒక రోజు ముందే స్వామి వారి సన్నిధికి మంత్రి పువ్వాడ దంపతులు చేరుకుని ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే వారు. అయితే ఈ సారి మాత్రం అనుకోని పరిస్థితులు ఎదురు కావడంతో మంత్రి అజయ్ కుమార్ భద్రాద్రి సన్నిధికి చేరుకునే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. బుధవారం సాయంత్రం మంత్రి అజయ్ కుమార్ తండ్రి, సీపీఐ సీనియర్ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వర్ రావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన హైదరారాబాద్ కు తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఆయన్ను హైదరాబాద్ తరలించగా, మంత్రి అజయ్ కుమార్ కూడా తన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ వెల్లిపోయారు. తండ్రి వెంటే ఉంటూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్న అజయ్ కుమార్ గురువారం భద్రాద్రిలో జరగనున్న శ్రీ సీతారామ కళ్యాణోత్సవానికి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే స్వామి వారి కళ్యాణోత్సవాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు మాత్రమే ప్రత్యక్ష్యంగా పాల్గొంటున్నారు. సీతారాములకు ముత్యాల తలంబ్రాలు అందించే ప్రక్రియకు మంత్రి వస్తారా లేక ఇతర ప్రముఖులు ఎవరైనా హాజరవుతారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

bhadradriLatest Newsminister puvvada ajay kumarpuvvada ajay kumarsrirama navamitelangana news