బీఆరెఎస్ వర్సెస్ కాంగ్రెస్….

ధర్మారం మండలంలో ఉద్రిక్తత

దిశ దశ, పెద్దపల్లి:

ప్రకృతి బీభత్సంతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం పక్కనపెట్టి ఆదిపత్య పోరుకు తెరతీశారక్కడ. మండుటెండల్లోనూ వరణుడి ఉగ్రరూపం, ఈదురు గాలుల బీభత్సంతో అతలాకుతలం అయిన రైతన్నకు బాసటగా నిలవాల్సిందిపోయి రెండు పార్టీల మధ్య పంచాయితీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ వివాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామంలో వడగండ్ల వర్షంలో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి జరుపుతున్న ఈ ఆందోళన వద్దకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పంట నష్టపరిహారం ఇప్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న క్రమంలోనే ఇరు పార్టీల నాయకుల మధ్య నినాదాల హోరు తీవ్రంగా పెరిగింది. రైతుల సమస్యల పట్టించుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు ఇచ్చుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను అక్కడి నుండి పంపించి వేశారు.

ఖిలా వనపర్తిలో మాటల యుద్దం
adloori laxman kumarBRS NEWSCONGRESS NEWSLatest NewsPEDDAPALLY DISTRICTtelangana news