వక్ఫ్ బోర్డు భూములు ఆయనే కబ్జా చేశాడు… బీఆర్ఎస్ నాయకుడి వీడియో వైరల్

దిశ దశ, కరీంనగర్:

మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీరుపై సొంతపార్టీ నాయకుల వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఓ వైపున బహిరంగ సభల్లోనే ఉద్యమ కారులు నిలదీస్తుంటే మరో వైపున రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఖాజీపూర్ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన విషయంలో గంగులపై ఆరోపణలు చేస్తున్నారు.

ఖాజీపూర్ భూములపై…

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు గంగుల కమలాకర్ లక్ష్యంగా మైనార్టీ నాయకుడు చేస్తున్న ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. కరీంనగర్ సమీపంలోని ఖాజీపూర్ లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను కబ్జాకు పాల్పడ్డ విషయంలో చాలాకాలంగా కూడా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ మైనార్టీ నాయకులు సమద్ నవాబ్ నేతృత్వంలో మస్జీదుల వద్ద గంగుల కమలాకర్ వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కౌంటర్ ఇచ్చారు. కానీ తాజాగా అదే పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్ పై ఆరోపణలు చేస్తున్న వీడియో కరీంనగర్ లో సంచలనంగా మారింది. ఖాజీపూర్ లోని వక్ఫ్ బోర్డుకు చెందిన 14 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపించిన సదరు వ్యక్తి ఆ భూమిని ఎలాగైనా తిరిగి స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. కరీంనగర్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


BRS NEWSgangula kamalakarkarimnagar newskcr newsLatest News
Comments (0)
Add Comment