దిశ దశ, హైదరాబాద్:
మాజీ ఐఏఎస్ అధికారి దేబబ్రత కంఠ మంగళవారం రాతి మృతి చెందారు. కళింగ హస్పిటల్ బీబీఎస్ఆర్ ఒడిశాలో మంగళవారం రాత్రి 10.20 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు. 1990ల్లో ఐఏస్ అధికారిగా సేవలందించిన ఆయన వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పని చేశారు. ఆయన సతీమణి సౌమ్య మిశ్రా ప్రస్తుతం తెలంగాణాలో ఐపీఎస్ అదికారిగా సేవలందిస్తున్నారు. వరంగల్ జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రజా పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించారు. 1998 నుండి 2001 వరకు కరీంనగర్ కలెక్టర్ గా సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ హయాంలో కరీంనగర్ లో విధులు నిర్వర్తించిన ఆయన ఉజ్వల పార్క్, అంబేడ్కర్ స్టేడియం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రికార్డు స్థాయిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీపం పథకంద్వారా సామాన్యులకు గ్యాస్ కనెక్షన్ల అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆ తరువాత కొంత కాలం ఐఏఎస్ గా ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించిన ఆయన రాజీనామా చేసి ఒడిశా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్ సాధించుకున్న ఐఏఎస్ అధికారుల జాబితాలో కంఠ కూడా ఉంటారు. కానీ అర్థాంతరంగా రాజీనామా చేసి సొంత రాష్ట్రానికి వెళ్లిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మరుగున పడిపోయినట్టయింది. దేబబ్రత కంఠకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.