చర్లబుత్కూరులో దళితుల ఆందోళన: మంత్రి హామీతో విరమణ

దిశ దశ, కరీంనగర్:

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ దశాబ్ది ఉత్సవాలలో పర్యటలో భాగంగా గురువారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మంత్రి కమలాకర్ వస్తున్నారన్న సమాచారం అందుకున్న దళితులు నిరసనకు దిగారు. దీంతో మంత్రి వారి వద్దకు వెల్లి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లబుత్కూరు గ్రామంలో మంత్రి పర్యటిస్తున్న నేపథ్యంలో తమ గ్రామంలో ఒక్కరికి కూడా దళిత బంధు స్కీం అమలు కాలేదంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి వేదిక వద్దకు వెల్లకుండా అడ్డుకుని బైఠాయించడంతో కరీంనగర్ రూరల్ పోలీసులు వారిని పక్కకు జరగాలని సూచించినా వినకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన చేస్తున్న వారి వద్దకు చేరుకుని వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. వేరే గ్రామంలో దళిత బంధు స్కీం అమలువుతున్నా తమ గ్రామంలో మాత్రం ఒక్కరికి కూడా అందలేదని వారు మంత్రికి వివరించారు. తమకు స్కీం అమలు చేయాలని వారు మంత్రిని కోరగా… ప్రతి ఒక్క దళిత కుటుంబాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ స్కీం అందరికీ వర్తింపజేస్తామన్నారు. పెన్షన్లు, కానీ ఇతరాత్ర భరోసా పథకాలు కానీ అందించేంది సీఎం మాత్రమేనని ఇంతకు ముందు దళిత బంధు స్కీం ఎవరైనా అమలు చేశారా అని అడిగారు. ఏ ముఖ్యమంత్రులు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం దళితుల ఆర్థిక భరోసా కోసం చేపట్టిన పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. విడుతల వారిగా దళిత బంధు లబ్దిదారులకు వస్తుందని ఎలాంటి సంశయం చెందాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. మీరు మాట సరిపోతుందని దళితులు తమ నిరసన విరమించడంతో మంత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెల్లారు.

cm kcrgangulagangula kamlakarkarimnagar newsKCRLatest NewsMINISTER GANGULAtelangana news