సీపీ గౌష్ ఆలం పర్యవేక్షణ…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగరాన్ని పోలీసులు అష్ట దిగ్భంధనం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ఒక్కసారిగా నగరంలోని కూడళ్లలో పోలీసులు మోహరించారు. వాహనాల తనిఖీతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కూడా చేపట్టారు. శనివారం రాత్రి పోలీసులు కరీంనగర్ లోని 20 ప్రాంతాల్లో 150 మంది పోలీసులు ఏక కాలంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సీపీ గౌష్ ఆలం కూడా రంగంలోకి దిగి నాకా బందీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్యాంపరిగ్ నంబర్ ప్లేట్లు వాడుతున్న వాహనాలు, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించారు. డాక్యూమెంట్లు సరిగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నగరంలో కట్టదిట్టంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ఉంటాయని చేతల్లోనే చూపించారు.
తరుచూ చేపడతాం: సీపీ
నగరంలో అసాంఘీక కార్యకలపాలకు, నిబంధనలకు అతిక్రమించే వారిని కట్టడి చేసేందుకు పకడ్భందీగా వ్యవహరిస్తున్నామని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తామన్నారు. నగరంలో ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు తరుచూ చేపడ్తామని స్పష్టం చేశారు.