పులి ఇలాకాలో పేకాట కేంద్రం

దాడి చేసిన పోలీసులు

దిశ దశ, మంచిర్యాల:

అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని అధికారికంగా టైగర్ జోన్ గా డిక్లేర్ చేయనుప్పటికీ పులి సంచరించే అడవుల్లో ఆ ప్రాంతం కూడా ఒకటి. స్థానికంగా ఉన్న వారు కూడా ఇదే విషయం చెప్పుకుంటూ ఆ అడవుల్లో సంచరించేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే వారికి మాత్రం ఆ ప్రాంతం సేఫ్ జోన్ గా మారిపోయింది. శనివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) అటవీ ప్రాంతంలో దర్జాగా పేకట ఆడుతూ జూదగాళ్లు అడ్డాగా మార్చుకున్నారు. భీమన్న గుడి అటవీ ప్రాంతంలో నేచురల్ క్లబ్ ఏర్పాటు చేసుకుని దర్జాగా పేకాట ఆడడం మొదలు పెట్టారు. వీరు జూదం ఆడుతున్న ప్రాంతానికి కొంత దూరం వరకూ పులి సంచరించి వెల్తుందని స్థానికులు చెప్తున్న బట్టి స్పష్టం అవుతోంది. అయితే పులి తిరిగే ప్రాంతం అయినందున తమ వైపు ఎవరూ పట్టించుకోరని అనుకున్నారో లేక మరేదైనా కారణమో తెలియదు కాని భారీ సంఖ్యల ఆ అడవుల్లోకి చేరుకుంటున్న జూదగాళ్లు మాత్రం నిర్భయంగా పేకాట ఆడుతున్నారు. అయితే పులి సంగతి అలా ఉంచితే వారిపై మాత్రం పోలీసులు ముప్పేట దాడి చేశారు. దీంతో ఘటనా స్థలం నుండి రూ. 13.11 లక్షల నగదు, 14 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆ దాడుల్లో కౌటాల సీఐ సాదిక్ పాషా, స్థానిక ఎస్సై దీకొండ రమేష్ తో పాటు పోలీసు యంత్రాంగం పాల్గొంది. అటవీ ప్రాంతంలో ఆడుతున్న తమను ఎవరూ పట్టుకోరన్న ధీమాతో ఉన్న జూదగాళ్లకు పోలీసులు ఒక్కసారిగా షాకిచ్చారు.

asifabad newscrimecrime newsCRIME TODAYLatest Newsmanchirial newsSIRPUR