ఇంటి పేరు వేరుగా ఉందని…

దిశ దశ, వేములవాడ:

హాల్ టికెట్ లో ఓ తీరుగా ఆధార్ కార్డులో మరో తీరుగా ఇంటి పేరు ఉందన్న కారణంతో ఓ అభ్యర్థిని పరీక్షా కేంద్రం ముందే నిలువరించారు అధికారులు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 4 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత లోపలకు అనుమతించాలని టీపీఎస్సీ ఆదేశించడంతో పరీక్షా కేంద్రాల వద్ద డ్యూటీలు నిర్వహించే వారికి కొత్త కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నట్టున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఓ అభ్యర్థిని లోపలకు అనుమతించ లేదు. హాల్ టికెట్ లో ఉన్న ఇంటి పేరు, ఆధార్ లో ఉన్న ఇంటి పేరు వేర్వేరుగా ఉండడంతో పరీక్షా కేంద్రం వద్ద డ్యూటీ చేస్తున్న వారు ఆమెను లోపలకు అనుమతించలేదు. దీంతో అభ్యర్థి కుటుంబ సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వివాహం అయిన తరువాత ఇంటి పేరు మారుతుంది కదా ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అయితే జిల్లా కలెక్టర్ ను అడిగి అనుమానాలు నివృత్తి చేసుకున్న తరువాత పరీక్షకు అనుమతిస్తామని అక్కడి అధికారులు చెప్పారు. చివరకు జిల్లా కేంద్రం నుండి సదరు అభ్యర్థిని పరీక్షకు అనుమతించాలని ఆదేశాలు రావడంతో పరీక్షా కేంద్రం వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు అభ్యర్థిని పరీక్షకు అనుమతించారు.

group 4th examsgroups examsLatest Newsrajanna siricilla districttelangana newstpsctpsc exams