దిశ దశ, జగిత్యాల:
జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఆ రెండు పార్టీల నాయకులు కలవడం చర్చకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు జూనియర్ కార్యదర్శుల సమ్మె శిబిరాలను సందర్శించే పనిలో ప్రతిపక్ష నాయకులు నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జూనియర్ కార్యదర్శుల సమ్మె శిబిరాన్ని ఉధ్దేశించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారు. కార్యదర్శులను రెగ్యూలరైజ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో శిబిరంలోకి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ అరవింద్ లు పరస్పరం పలకరించుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అరవింద్ లు నవ్వుతూ ఛలోక్తులు విసురుకోవడంతో అప్పటి వరకు సీరియస్ గా ఉన్న శిబిరంలో నవ్వులు పండాయి.