హైదరాబాద్ లో ఐటీ రైడ్స్: ఏమ్మార్ సంస్థలపై కొరడా


దిశ దశ, హైదరాబాద్:

నిన్న మొన్నటి వరకు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయిన ఐటీ దాడులు తెలంగాణ రాష్ట్రానికి పాకాయి. హైదరాబాద్ నగరంలో శనివారం 12 చోట్ల ఏకకాలంలో ఇన్ కంట ట్యాక్స్ అధికారుల బృందాలు దాడులకు శ్రీకారం చుట్టాయి. ఏఎమ్మార్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ మహేశ్వర్ రెడ్డి ఇంటితో పాటు సంస్థకు సంబంధించిన 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సంస్థ బొగ్గు నిక్షేపాలను వెలికితీసే కాంట్రాక్టులతో పాటు ఇతర కాంట్రాక్టులు కూడా చేపడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ద్వారా భూపాలపల్లి జెన్ కో కు బొగ్గు నిక్షేపాలు వెలికి తీసి సరఫరా చేసే కాంట్రాక్ట్ కూడా నిర్వహిస్తోంది. తాజాగా ఈ సంస్థపై దాడులు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సంస్థకు సంబంధించిన రూ. 3 కోట్ల వరకు నగదును అధికారులు రికవరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఐటీ అధికారులు సోదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ అధికారులతో పాటు ఎన్నికల కమిషన్ కు చెందిన అధికారులు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. రెండు శాఖలు జాయింట్ ఆపరేషన్ చేపట్టడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులు, ఐటీ అధికారులు సోదాలు చేపట్టడం వెనక బలమైన కారణాలు ఉండి ఉంటాయన్న చర్చ సాగుతోంది. కర్ణాటకతో పాటు తెలంగాణాలో కూడా పెద్ద ఎత్తున ఐటీ బృందాలు సోదాలు చేస్తుండడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

IT RAIDSIT raids on AMR organization in HyderabadLatest Newstelangana news