ఆ జీఓ వట్టిదేనా..?

రసమయిని ప్రశ్నిస్తూ వెలిసిన ఫ్లెక్సీలు

దిశ దశ, కరీంనగర్:

రూ. 71 కోట్ల నిధులు విడుదల చేస్తూ జారీ అయిన జీఓ వట్టిదేనా అని ప్రశ్నిస్తున్న ఫ్లెక్సీలు గన్నేరువరం మండలంలో కలకలం సృష్టిస్తున్నాయి. రోడ్డు నిర్మాణం కోసం ఇచ్చిన హామీ ఇంకా ఆచరణకు నోచుకోలేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశం అయ్యాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు చోట్ల ఫ్లెక్సీలను బీజేపీ మండలం శాఖ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారూ డబుల్ రోడ్డు పూర్తయ్యేదెన్నడూ అంటూ ప్రశ్నించారు. గుండ్లపల్లి, పొత్తూరు డబుల్ రోడ్డు పనులు అటకెక్కినట్టేనా, గుండ్లపల్లి… కొండాపూర్ ప్రజలు ధుమ్ముతో అవస్థలు పడాల్సిందేనా..? ఎమ్మెల్యే రసమయి గారు ఇదేనా మారు చేసిన అభివృద్ది, మండల ప్రజల కష్టాలు తీరేదెన్నడూ అంటూ ఆ ఫ్లెక్సీలో రాసి ఆయా చోట్ల ఏర్పాటు చేయించారు. బీజేపీ పార్టీ పాదయాత్ర చేయడం, మండల యువకులు పోరాటంతో దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన ఫలితం లేకుండా పోయిందంటూ అందులో పేర్కొన్నారు.

సంచలనంగా మారిన అంశం….

ఈ రోడ్డు కోసం గన్నేరువరం మండలంలోని యువత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. రసమయి బాలకిషన్ పర్యటనకు వెల్లినప్పుడు ఓ సారి ప్రశ్నించారు. ఆ తరువాత నిరసనలు చేపట్టడంతో మండలంలో ఉద్రిక్త పరిస్థిుతుల నెలకొన్నాయి. అన్ని పార్టీలు కూడా ఈ రోడ్డు నిర్మాణం కోసం నిధులు కెటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జివో విడుదల చేయడంతో రోడ్డు నిర్మాణ పనులకు మోక్షం కలిగిందని అందరూ భావించారు. అయితే నిధులు విడుదల అయి నెలలు గడుస్తున్న రోడ్డు పనులు జాడ కానరావడం లేదంటూ మళ్లీ నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. బీజేపీ మండల శాఖ పేరిట రోడ్డు గురించి ఎమ్మెల్యే రసమయిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

cm kcrganneruvaramkarimnagar newsLatest Newsmanakondurmla rasamairasamai balakishantelangana news