ఆ ఆనవాయితీ తప్పలేదా…? చొప్పదండి ఫలితం తేల్చిందేమంటే..?

దిశ దశ, చొప్పదండి:

చొప్పదండి నియోజకవర్గంలో ఓ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఎస్సీ రిజర్వుడుగా మారిన తరువాత ఇక్కడి నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ కూడా రెండో సారి విజయం సాధించలేదు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇక్కడి నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే చట్ట సభకు అడుగుపెట్టుకోవడంతో సరిపెట్టుకుంటున్నారు. మొదట ఇక్కడి నుండి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య గెలవగా ఆ తరువాత ఆయన ఇక్కడి నుండి పోటీ చేసినా గెలవలేదు. 2014 ఎన్నికల్లో బొడిగె శోభ గెలుపొందగా 2018 ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో శోభ బీజేపీ నుండి పోటీ చేసినప్పటికీ గెలవలేకపోగా, అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సుంకె రవి శంకర్ విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సుంకె రవిశంకర్ పై కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం గెలిచారు. దీంతో ఇక్కడి నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ కూడా రెండోసారి అసెంబ్లీకి అడుగుపెట్టడం లేదన్న ఆనవాయితీ యథావిధిగా కొనసాగినట్టయింది.

ఓయూ టూ చొప్పదండి…

ఉస్మానియా విద్యార్థి నాయుకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేడిపల్లి సత్యం వరస ఓటములు చవి చూస్తూ వచ్చారు. మొదట ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తాజా ఎన్నికల వరకు ఇక్కడి నుండి పోటీ చేస్తూనే ఉన్నారు. తాజాగా చొప్పదండి ప్రజలు మేడిపల్లిని అక్కున చేర్చుకోవడంతో గెలుపు సునాయసం అయింది. గత ఎన్నికల తరువాత చొప్పదండి నియోజకవర్గంలో నెలకొన్న జరిగిన ప్రతి ఆందోళన కూడా మేడిపల్లి సత్యం నేతృత్వంలోనే కొనసాగాయి.

2023 assembly electionsDid that tradition continue in Choppadandi?Latest Newstelangana news