ఒడిశా రైలు ప్రమాదం సీబీఐ దర్యాప్తు షురూ…


దిశ దశ, ఒడిశా:

ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాదం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. బాలాసోర్ వద్ద కోరమండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ ను ఢీ కొట్టడంతో కోచులు మరో ట్రాక్ వరకు ఎగిరిపడ్డాయి. దీంతో అదే సమయంలో మరో ట్రాక్ మీదుగా వెల్తున్న యశ్వంత్ పుర్ హౌరా సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఈ కోచులను తగలడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 278 మంది మృత్యువాత పడగా మరో వెయ్యి మంది గాయాల పాలయ్యారు. దేశంలోనే అతి ఘోరంగా జరిగిన రైలు ప్రమాదాల్లో బాలాసోర్ యాక్సిడెంట్ ఒకటి కావడంతో దేశం అంతా ఉలిక్కిపడింది. ప్రధాని నరేంద్ర మోడీ ఘటనా స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బాలాసోర్ చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటు రైళ్ల రాకపోకలు పునరుద్దరించే వరకు అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనపై రకాల అనుమానాలు వ్యక్తమవుతుండడంతో రైల్వే బోర్డు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు 10 మంది అధికారులతో ఏర్పాటయిన విచారణ బృందం బాలాసోర్ చేరుకుంది. సోమవారం సాయంత్రం బాలాసోర్ చేరుకున్న ఈ టీం స్టేషన్ మేనేజర్ ను విచారించడంతో పాటు ఘటనా స్థలాన్ని సందర్శించి ఆరా తీయడం ఆరంభించింది.

మూడు కోణాల్లో దర్యాప్తు..!

సీబీఐ టీం బాలసోర్ ట్రైన్ యాక్సిడెంట్ విషయంలో ప్రధానంగా మూడు కోణాల్లో ఆరా తీయనున్నట్టు సమాచారం. ఈ ఘటన వెనక విధ్వంస కోణం ఏమైనా ఉన్నట్టయితే ఎవరి ప్రమేయం ఉండి ఉంటుంది, ఇందుకు చేతులు కలిపిన వారెవరు, ముందుగా రెక్కి నిర్వహించారా, రైల్వే విభాగంలో పని చేస్తున్న వారిని ట్రాప్ చేశారా తదితర వివరాలను సేకరించే అవకాశం ఉంది. ఈ ప్రమాదం వెనక నేరపూరితమైన నిర్లక్ష్యం ప్రదర్శించారా యాక్సిడెంట్ కావాలని ఈ చర్యలకు పాల్పడ్డారా దీని వెనక ఉన్నదెవరు అన్న విషయాలపై సీబీఐ బృందం దృష్టి సారించనుంది. ఉధ్దేశ్యపూర్వకంగానే ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ సిస్టం పాయింట్ మిషన్స్ సెట్టింగ్స్ మార్చి మెయిన్ ట్రాక్ నుండి లూప్ లైన్ ట్రాక్ కు కోరమండల్ ఎక్స్ ప్రెస్ వెల్లేలా చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న రైల్వే ఉద్యోగులు, అధికారులతో పాటు టెక్నికల్ అంశాలపై కూడా విచారించనున్నారు. సాంకేతికతను అంది పుచ్చుకుని కావాలని మిస్టేక్ చేసి తప్పించుకోవచ్చని ఎవరైనా ఈ చర్యలకు పాల్పడి ఉన్నట్టయితే వారిని గుర్తించేందుకు ఆరా తీయనున్నారు. సీసీ ఫుటేజీ రివ్యూ, నిపుణులచే టెక్నికల్ ఎనాలిసిస్ చేయడం వంటి అంశాలపై సీబీఐ దృష్టి సారించనుంది.

Balasore train accidentCBI starts investigationCoromandel Expresscrimecrime newsCRIME TODAYLatest NewsODISHA TRAIN ACCIDENTTrains Mishap in Odisha