బీర్పూర్ లేఖలపై పోలీసుల దర్యాప్తు

మాజీ నేతృత్వంలో సాగిన వ్యవహారం..?

మరిన్ని కోణాల్లో ఆరా తీస్తున్న వైనం

దిశ దశ, జగిత్యాల:

రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల ప్రజా ప్రతినిధులకు మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖలపై జిల్లా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలే లేని ఈ సమయంలో లేఖలు రావడం కలకలం సృష్టించింది. అయితే జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం వివిధ కోణాల్లో ఆరా తీసి నకిలీ నక్సల్స్ పనేనని ప్రాథమికంగా నిర్దారించినట్టు సమాచారం. మండలంలోని నర్సింహులపల్లెకు చెందిన బోగ సత్యనారాయణ కిరాణం షాపు లక్ష్యంగా లేఖల్లో హెచ్చరికలు ఉండడంతో అనుమానించిన పోలీసులు ఈ లేఖల వెనక స్థానికుల ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానించారు. దీంతో బోగ సత్తయ్య వ్యతిరేకులు ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో ఆరా తీయగా ఓ మాజీ నక్సల్ పేరు ప్రముఖంగా వినిపించినట్టు సమాచారం. పోలీసులు పూర్తిగా ఆరా తీయంగా సదరు వ్యక్తి పొరుగు జిల్లాలో తనకు పరిచయం ఉన్న ఓ డీటీపీ సెంటర్ ఓనర్ వద్ద లెటర్ హెడ్స్ ప్రింట్ చేయించుకుని లేఖలు సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖలతో నాయకులు, స్థానికులు భయాందోళనకు గురైనట్టయితే ముందు ముందు కూడా ఇలాగే వ్యవహరిస్తూ డబ్బు సంపాదించాలన్న స్కెచ్ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో ఇద్దరి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు నిర్దారించగా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో తెలుసుకుంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ ముఠా ఇంకా ఎవరెవరిని లక్ష్యంగా చేసుకుంది అన్న విషచయం కూడా తెలుసుకునే పనిలో పోలీసు అధికారులు పడ్డట్లు సమాచారం.

crime newsCRIME TODAYJAGITHYAL NEWSLatest Newsmaoist newsPseudo Naxalitetelangana crime newstelangana news